నవతెలంగాణ-హైదరాబాద్ : పెండ్లైన మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో మరణించారు నవ దంపతులు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది. భోజనం చేసి నిద్రపోయేందుకు గదిలోకి వెళ్లిన నవ దంపతులు తెల్లారేసరికి విగతజీవులుగా మారిపోయారు. పెండ్లైన మరుసటి రోజే వధూవరులు మరణించడం వల్ల ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది. కౌసర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోఢాహియా గ్రామానికి చెందిన ప్రతాప్కు గుల్లన్పుర్వ గ్రామ యువతి పుష్పతో మే 30న వివాహం జరిగింది. ఆ తర్వాత మే 31న వధువుతో కలిసి గ్రామానికి వచ్చాడు వరుడు ప్రతాప్. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లి నిద్రపోయారు. తెల్లారినా సరే వధూవరులు నిద్ర లేవకపోవడం వల్ల కుటుంబసభ్యులు తలుపు తట్టారు. ఎంతసేపు తట్టినా తలుపు తీయకపోవడం వల్ల అనుమానించి కుటుంబసభ్యులు కిటీకీలోంచి చూడగా ఇద్దరూ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే తలుపులు పగలకొట్టి వెళ్లి చూస్తే విగతజీవులై కనిపించారు. కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. శవపరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి గల కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. గదిలో సమోసాలు, కూల్డ్రింక్స్ లభ్యమయ్యాయని తెలిపారు.