– దురహంకార వ్యాఖ్యలపై రైతులకు క్షమాపణ చెప్పాలి
– రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం, మహాధర్నా
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతన్న అంటే ఎందుకంత చిన్న చూపు చూస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా, హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ఉరి తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయానికి 3గంటల కరెంటు సరిపోతుందని ఉచిత కరెంటు పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత కండ్ల మంట ఉందో అర్థమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక రైతులు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంతర కరెంట్ సరఫరాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతులను మళ్ళీ చీకట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. మొదటి నుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్నచూపని, మొన్న ధరణి వద్దన్నారని, వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందనడం కాంగ్రెస్ రైతు వ్యతిరేఖ పార్టీ అని అర్ధమవుతుందని వ్యాఖ్యనించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంటు కెసిఆర్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పి బంగాళఖాతంలో కలపాలని హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజని తిరుపతిరెడ్డి, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీ బిలునాయక్, పట్టణ అధ్యక్షుడు అన్వర్, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, అక్కన్నపేట మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు సర్పంచ్ లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.