బర్త్ డే గిఫ్ట్ ఇవ్వలేదని భర్తను కొట్టి చంపిన భార్య

నవతెలంగాణ పుణె: తన పుట్టినరోజుకి దుబాయ్‌ తీసుకు వెళ్లలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన పుణె (Pune)లో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన నిఖిల్‌ ఖన్నా అనే వ్యాపారవేత్త ఆరేండ్ల కిందట రేణుక అనే యువతిని ప్రేమ పెండ్లి చేసుకున్నాడు. భార్య పుట్టినరోజు సందర్భంగా భర్త నుండి విలువైన బహుమతులు ఆశించింది. దుబాయ్‌ తీసుకువెళ్లాలని సైతం పట్టుబట్టింది. అందుకు నిఖిల్‌ నిరాకరించాడు. అంతేకాకుండా, బంధువుల బర్త్‌డే పార్టీల కోసం ఢిల్లీకి వెళ్లేందుకు కూడా అతను ఆసక్తి చూపలేదు.
దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త పెరగడంతో భర్తపై ఆమె దాడికి దిగింది. అతడి ముఖంపై పిడి గుద్దులు కురిపించింది. దీంతో అతడి ముక్కు పగిలి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దంతాలు కూడా ఊడిపోయాయి. దెబ్బలకు తాళలేని నిఖిల్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందనట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు భార్యపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Spread the love