అటవీ కళాశాల ఆధ్వర్యంలో ‘వైల్డ్‌ ఫ్లేవర్స్‌’ తేనె

– ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ములుగు ఫారెస్ట్‌ కాలేజి ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన ఆర్గానిక్‌ తేనె ‘వైల్డ్‌ ప్లేవర్స్‌’ను సోమవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్‌ (సేంద్రియ) తేనె ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. కళాశాల డీన్‌ ప్రియాంక వర్గీస్‌ మాట్లాడుతూ…రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్ధిపై ములుగు ఫారెస్ట్‌ కళాశాలలో రైతులకు, మహిళలకు, ఔత్సాహికులకు వారం పాటు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సేంద్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను ”వైల్డ్‌ ఫ్లేవర్స్‌” బ్రాండ్‌ పేరుతో అందుబాటులోకి తేబోతున్నామనీ, ములుగు అటవీ కళాశాలలో త్వరలోనే తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్‌, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం.డోబ్రియల్‌ పాల్గొన్నారు.

Spread the love