ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం

–  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
–  హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పి.మాణిక్‌రెడ్డి తరపున టీఎస్‌ యూటీఎఫ్‌ ప్రచారం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఎస్‌యూటీఎఫ్‌ బలపరిచిన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పి.మాణిక్‌ రెడ్డి తరపున రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌ జూనియర్‌ కాలేజీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు బాగుపడాలంటే ఈ ఎన్నికల సమయంలో ఓటును ఆయుధంగా వాడాలన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలిపారు. పోరాడుతేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఎస్‌ యూటీఎఫ్‌ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, రాజేంద్రనగర్‌ మండల అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి రవీందర్‌, జిల్లా కౌన్సిలర్లు సీతయ్య, మల్లయ్య, కార్యదర్శి మహేష్‌ పాల్గొన్నారు.

Spread the love