కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది : కేటీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరు నెలల కాలంలోనే ప్రజలకు పూర్తిగా అర్థమయిపోయిందని చెప్పారు. ఉపాధి కల్పన కోసం తాము ఎంతో కృషి చేశామని… పదేళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా పదేళ్ల కాలంలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని చెప్పారు. తెలంగాణలో సాగునీటికి, తాగునీటికి, విద్యుత్ కు లోటు లేకుండా చేశామని అన్నారు. తాము చేసిన పనులపై ఎక్కువగా ప్రచారం చేసుకోలేక పోయామని… అదే బీఆర్ఎస్ కు మైనస్ పాయింట్ అయిందని చెప్పారు. ఉద్యోగాల కల్పనపై సరిగా ప్రచారం చేసుకోకపోవడం తమ తప్పే అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని… త్వరలోనే తమ పార్టీ పూర్వ వైభవం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని చెప్పారు.

Spread the love