జానారెడ్డిపై సీఎం అసత్య ప్రచారం తగదు

–  స్పీకర్‌కు సీఎల్పీ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డిపై సీఎం కేసీఆర్‌, మంత్రులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరోధించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని సీఎల్పీ బృందం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని కోరింది. ఈమేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం బుధవారం అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. 2014-15 వార్షిక బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ మూడేండ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తీ చేస్తే, తాను టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తానని మాత్రమే చెప్పారని లేఖలో పేర్కొన్నారు. కానీ సీఎం కేసీఆర్‌, మంత్రులు తరచుగా మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తే టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తానని జానారెడ్డి చెప్పినట్టు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జానారెడ్డి ప్రసంగానికి సంబంధించిన సీడీలను గతంలోనే స్పీకర్‌కు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Spread the love