పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత

– కమాండో నుంచి అధ్యక్షుడి వరకూ..
– ముషారఫ్‌ వివాదాస్పద ప్రస్థానం
దుబాయ్‌ : పర్వేజ్‌ ముషారఫ్‌ కమాండో నుంచి పాకిస్థాన్‌ సైనిక పాలకుడి వరకూ వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఆదివారం అమిలోయిడోసిస్‌ అనే అరుదైన వ్యాధితో దుబారులో ఆయన మరణించినట్లు పాక్‌ వర్గాలు పేర్కొన్నాయి. 2018 నుంచి ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్య చికిత్స నిమిత్తం 2016 మార్చిలో దుబారు వెళ్లిన ఆయన అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూలులో చదివారు. ఆ తర్వాత లాహౌర్‌లోని ఫోర్మన్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌లో చదివారు. 1961లో పాకిస్థాన్‌ మిలిటరీ అకాడమీలో చేరారు. పాకిస్థాన్‌ ఆర్మీలో 1964లో చేరారు. 1965లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం సమయంలో ఆయన సెకండ్‌ లెఫ్టినెంట్‌ హోదాలో ఉన్నారు. 1980వ దశకంలో ఆయన ఓ ఆర్టిలరీ బ్రిగేడ్‌కు చీఫ్‌గా ఎదిగారు. ఆఫ్ఘనిస్థాన్‌ సివిల్‌ వార్‌లో చురుకైన పాత్ర పోషించారు. తాలిబన్లకు పాకిస్థాన్‌ మద్దతును ప్రోత్సహించారు. 1998లో అప్పటి పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఆయనకు ఫోర్‌ స్టార్‌ జనరల్‌ హోదా ఇచ్చారు. దీంతో ఆయన పాకిస్థాన్‌ రక్షణ దళాలకు అధిపతి అయ్యారు. 1999లో కార్గిల్‌ యుద్ధం ఆయన హయాంలోనే జరిగింది. ఈ యుద్ధంలో భారత్‌ ఘన విజయం సాధించింది.
షరీఫ్‌, ముషారఫ్‌ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ముషారఫ్‌ను ఆర్మీ చీఫ్‌ పదవి నుంచి తొలగించేందుకు షరీఫ్‌ విఫలయత్నం చేశారు. దీంతో ముషారఫ్‌ నేతత్వంలో సైన్యం తిరుగుబాటు చేసింది. 1999లో షరీఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చేసింది. 1998 నుంచి 2007 వరకు పాకిస్థాన్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు చైర్మన్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీగా వ్యవహరించారు. 2001లో పాకిస్థాన్‌ అధ్యక్ష పదవిని ముషారఫ్‌ చేపట్టారు. షరీఫ్‌ను గహ నిర్బంధం చేశారు. ఆయన 2001 జూన్‌ 20 నుంచి 2008 ఆగస్టు 18 వరకు పాకిస్థాన్‌ దేశాధ్యక్షునిగా పని చేశారు. 2008లో ఎన్నికల అనంతరం అభిశంసనను ఎదుర్కొన్న ముషారఫ్‌ దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గృహ నిర్బంధంలో ఉన్న ఆయన వైద్య చికిత్స కోసం దుబారు వెళ్లేందుకు 2016లో అనుమతి పొందారు. 2016 మార్చిలో దుబారు వెళ్లిన తర్వాత అక్కడే ఉండిపోయారు. 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్‌ చేసినందుకు ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. తర్వాత కోర్టు తీర్పును రద్దు చేసింది. పాక్‌ మాజీ ప్రధాన మంత్రి బేనజీర్‌ భుట్టో హత్య, రెడ్‌ మాస్క్‌ క్లరిక్‌ హత్య కేసుల్లో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన దేశం నుంచి పరారైనట్లు పాక్‌ ప్రకటించింది. నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ముషారఫ్‌పై తీసుకున్న చర్యలన్నీ రాజ్యాంగ విరుద్ధమని లాహోర్‌ హైకోర్టు 2020లో ప్రకటించింది. ఆయన పాలనలో మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘనకు గురయ్యాయని 2013లో హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ పేర్కొంది. ముషరఫ్‌ కుటుంబ సభ్యులకు పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ తన సానుభూతి తెలియజేశారు.

Spread the love