భద్రతా మండలి స్థంభించిపోయింది

– ప్రస్తుత వాస్తవాలను ప్రతిబించించడం లేదు
– ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షులు కస్బా కొరొసి
న్యూయార్క్‌ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థంంభించిపోయిందని, ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించడం లేదని ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షులు కస్బా కొరొసి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ శాంతి, భద్రతను రక్షించడంలో తన ప్రాథమిక విధిని భద్రతా మండలి నిర్వర్తించలేకపోయిందని అన్నారు. భద్రతా మండలిని శక్తివంతంగా తీర్చిదిద్దడానికి దానిని సంస్కరించాలనే డిమాండ్‌ సభ్యదేశాల నుంచి పెరుగుతోందని చెప్పారు. ఆదివారం ఇక్కడ భారత పర్యటనకు బయలుదేరే ముందు కొరొసి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆహ్వానం మేరకు దేశంలో మూడు రోజుల పాటు కొరొసి పర్యటించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత హంగేరికి చెందిన కొరొసికి ఇదే మొదటి విదేశీ పర్యటన కావడం విశేషం. ‘భద్రతా మండలి చాలా సులభమైన కారణంతో తనన ప్రాథమిక విధిని నిర్వహించదు. భద్రతా మండలి వ్యవస్థగా ఉండాలి. కానీ వీటో అధికారం కారణంగా భద్రతా మండలి చర్యలు తీసుకోలేదు’ అని అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య స్థానానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో భారత్‌ ముందంజలో ఉందని అన్నారు.

Spread the love