1 నుంచి 10 వరకు నిరసన కార్యక్రమాలు

1 to 10 protest events– పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ ఒకటి నుంచి 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడ్తామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మండల, డివిజన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సామా న్యులు జీవించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాజ్యాన్ని దేశంలో విలీనం చేశారని, అందులో హిందువులు ముస్లింలు ప్రాణం కోల్పోయారని గుర్తు చేశారు. దీనిని కొన్ని మతతత్వ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డా.మల్లు గౌతమ్‌రెడ్డి, భావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, పాల్వాయి రాంరెడ్డి, చిరుమళ్ల భిక్షం, రామారావు పాల్గొన్నారు.

Spread the love