చైనాలో ఘోర బస్సు ప్రమాదం.. 14 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. హుబేయ్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 51 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టన్నెల్‌ ఇంటీరియర్‌ వాల్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 37 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love