– కంగుతిన్న ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు
నవతెలంగాణ-శంషాబాద్
విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తీసుకొని రావడానికి నిందితులు రకరకాలుగా ప్రయత్నాలు చేసుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. ఈ నెల 3న దుబారు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి 461 గ్రాముల బంగారంతో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. అనుమానంతో అతని లగేజీని అధికారులు తనిఖీ చేయగా.. బంగారం చీర దొరికింది. బంగారాన్ని లిక్విడ్గా మార్చి దాన్ని చీరపై స్ప్రే చేసి సదరు వ్యక్తి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. దాని విలువ రూ.28,01,036 ఉంటుందని అంచనా వేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.