ముగిసిన ఆరో దశ పోలింగ్: రాత్రి 7 గంటల వరకు 59.06 శాతం పోలింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో నేడు ఆరో విడత పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ముగింపు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. కాగా, రాత్రి 7 గంటల సమయానికి 59.06 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. ఆరో విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. దేశంలో ఈసారి 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తుండగా… నేటితో 6 దశల పోలింగ్ పూర్తయింది. ఇప్పటివరకు 6 విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. చివరిదైన ఏడో విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఈ విడతలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Spread the love