Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభూపరిపాలనలో మరో ముందడుగు

భూపరిపాలనలో మరో ముందడుగు

- Advertisement -

ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు
19న లైసెన్సులు ఇవ్వనున్న సీఎం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతాంగానికి మెరుగైన సేవలందించడానికి, రాష్ట్రంలో భూములకు సంబంధించిన అనేక పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి డిఎస్‌ లోకేష్‌కుమార్‌, సర్వే విభాగం కమీషనర్‌ రాజీవ్‌గాంధీ హనుమంత్‌తో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే గ్రామపాలనాధికారులు (జీపీవో)ను అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా క్షేత్రస్ధాయిలో ప్రజలకు సులభంగా భూ సేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4నుంచి 6మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ఈ నెల 19న శిల్ప కళావేదికలో సీఎం చేతులమీదుగా శిక్షణ పొందిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్‌ సమయంలో భూమి సర్వే మ్యాప్‌ను జత పరచడాన్ని తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆ విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుందన్నారు. భూభారతి చట్టంలో పేర్కొన్నవిధంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 350 మంది సర్వేయర్లు సరిపోరనీ, మరికొంత మంది అవసరమవుతారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను తీసుకోవడం, ఆ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ, అవసరమైన అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్వేయర్ల కోసం పది వేల మంది దరఖాస్తు చేసుకున్నారనీ, తొలివిడతలో ఏడు వేల మందికి శిక్షణ ఇవ్వగా, 3,465 మంది అర్హత సాధించారని తెలిపారు.

భూ విస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తామన్నారు. రెండో విడతలో మరో మూడు వేల మందికి ఆగస్టు 18 నుంచి శిక్షణను ప్రారంభించామనీ, ఈ నెల 26న జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో అర్హత సాధించిన వారికి 40 రోజుల పాటు అప్రంటిస్‌ శిక్షణ ఉంటుందనీ, వీరి సేవలు డిసెంబర్‌ రెండో వారం నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉన్నప్పుడే వివాదాలు తగ్గుతాయనీ, సర్వే వ్యవస్థ బలపడితేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుందన్నారు. పదేండ్లుగా క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో సర్వే విభాగం నిర్లక్ష్యానికి గురైందని, ప్రజలకు తగిన సేవలు అందలేదని విమర్శించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీవోలు, ప్రతి మండలంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు – ఈ రెండు చర్యలతో ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు అందేలా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యమని స్పష్టంచేశారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవినీతి లేని సేవలు అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -