నవతెలంగాణ – జుక్కల్
ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను తప్పకుండా లబ్ధిదారులు గృహాలు నిర్మించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లో భాగంగా మండలంలోని కత్తల్ వాడి గ్రామాన్ని జుక్కల్ ఎంపిడిఓ బుధవారం సందర్శించారు. మంజూరైన గృహ నిర్మాణాల లబ్ధిదారులతో ఎంపీడీవో ముచ్చటించారు. గ్రామంలో కొంతమంది లబ్ధిదారు లు గృహాలను నిర్మించుకొని పనులు ప్రారంభించుకోడం జరిగింది.
ఇంకొంతమంది లబ్ధిదారులు ఇప్పటికి పనులు మొదలు పెట్టకపోవడంతో వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకొంతమంది లబ్ధిదారులు బుధవారం ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకోవడానికి ఎంపీడీవో చేతుల మీదుగా ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. గ్రామంలో ప్రతి గృహ నిర్మాణ పథకంలో మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు నిర్మించుకుంటే మూడు విడుదలవారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మండలంలోని కేంరాజు కల్లాలి గ్రామంలో గ్రామస్తులతో కలిసి గృహ నిర్మాణాల కు ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీవో రాము, ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణ లబ్ధిదారులు , గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.