తహసీల్దార్, ఎస్ఐలకు లబ్దిదారుల వినతి
ఇండ్లకు తాళాలు వేసేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నం
కాళ్లు మొక్కి వేడుకున్న బాధితులు
నవతెలంగాణ-తొర్రూరు
నాలుగేండ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తుందని నిరుపేద లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తహసీల్దార్ జి.శ్రీనివాస్, ఎస్ఐ ఉపేందర్ సందర్శించారు. ఇండ్లు ఖాళీ చేయాలని లబ్దిదారులకు సూచించారు. దాంతో లబ్దిదారులు అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ.. దసరా రోజు సుమారు 280మంది లబ్దిదారులు గృహప్రవేశం చేసి, పది రోజులుగా అక్కడే వంటావార్పు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
ఇండ్లకు పట్టాలు ఇప్పించాలని పోరాటం చేస్తున్నా జిల్లా కలెక్టర్ గానీ, స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గానీ పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేడు శిథిలావస్థకు చేరుతుంటే గూడు లేని తాము తలదాచుకోవడానికి అందులో ఉండడం నేరమా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేక పది రోజులుగా మహిళలు చిన్నపిల్లలతో నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, ఇండ్లకు పట్టాలిచ్చేలా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ చొరవచూపాలని కోరారు.



