Tuesday, October 28, 2025
E-PAPER
Homeకరీంనగర్పట్టించుకోని నేతలు… పరుగు పెట్టని రైలు

పట్టించుకోని నేతలు… పరుగు పెట్టని రైలు

- Advertisement -

కొత్తపల్లి- మనోహరాబాద్ మార్గంపైనే జిల్లా వాసుల ఆశలు
రైల్వే లైన్ పై దృష్టి సారించని కేంద్రమంత్రి బండి సంజయ్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
వస్త్రోత్పత్తి రంగంలో రెండో సోలాపూర్ గా సిరిసిల్లకు పేరుంది. జిల్లా కేంద్రంగా అభివృద్ధి పథం వైపు పయనిస్తున్న సిరిసిల్లా తో పాటు దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్న వేములవాడకు రైలు మార్గం పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు రైలు కూత కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తపల్లి.. మనోహరాబాద్ రైలు మార్గం పూర్తయితే జిల్లా వాసులకు మేలు జరుగుతుంది. పనులు సాధ్యమైనంత తొందరగా చేయాలని అధికారులు భావిస్తున్నప్పటికీ భూసేకరణలోని వస్తున్న అడ్డంకులు మరింత జాప్యానికి కారణమవుతున్నాయి.

గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ పోటీ చేయగా ఓటర్లు అత్యధిక ఓట్లు వేసి గెలిపించారు. ఆ ఐదేళ్లలో బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎంపీగా బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమీ లేదు అంతేకాకుండా ఐదేళ్లలో పది సార్లు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆయన రాలేదు  పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా బండి సంజయ్ పోటీ చేయగా రాజన్న సిరిసిల్ల జిల్లా అతనికి అత్యధికంగా ఓట్లు వేసి మెజారిటీ ఇచ్చింది. ఈ ఓట్లతోనే గెలుపొందిన బండి సంజయ్  కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడంతో బండి సంజయ్ కు   కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవిని అప్పగించింది.రెండోసారి కూడా రాజన్న సిరిసిల్ల  జిల్లా అభివృద్ధికి ఎలాంటి నిధులు తీసుకురాలేదని ప్రజల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే లైన్ నిర్మాణంపై  కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

రెండు దశాబ్దాల నుంచి ఎదురు చూడటమే…

రాజన్న సిరిసిల్ల జిల్లాను కలుపుతూ 151.36 కిలోమీటర్ల పొడవున కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గం ఏర్పాటు చేయాలని రెండు దశాబ్దాల నుంచి ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఈ రైలు మార్గాన్ని రూ1160.47 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ మార్గానికి కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడంతో పనులు ముందుకు సాగిన దాఖలాలు లేవు. గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రైలు మార్గానికి అవసరమైన భూసేకరణ దానికి అయ్యే వ్యయం అంతా భరించాలని రైల్వే శాఖ షరతు విధించడంతోపాటు నిర్మాణ పనుల్లో మూడోవంతు భరించాలని నిబంధన పెట్టింది. కేంద్రం షరతులకు గత ప్రభుత్వం అంగీకరించడంతో రైలు మార్గం సర్వే పనులు మొదలుపెట్టారు.

మెదక్… సిద్దిపేట జిల్లాలో రైలు మార్గం సర్వే పనులు పూర్తికాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ యజమానులు అడ్డంకులతో సర్వే పనుల్లో జాప్యం జరిగింది. జిల్లాలో 17 రెవెన్యూ గ్రామాల్లో దాదాపు 950 ఎకరాల వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందులో 12 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. జిల్లాలో దాదాపు 60 కిలోమీటర్ల పొడవు రైలు మార్గం రానుంది. విస్తీర్ణపరంగా జిల్లాలో 50% మాత్రమే రైల్వే లైన్ నిర్మాణం కోసం భూ సర్వే పూర్తయిందని తెలుస్తుంది.

అడ్డంకులు తొలగితేనే పనుల్లో వేగం…

రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగితేనే పనుల్లో వేగం పెరుగుతుంది. భూసేకరణకు అడ్డుకుంటున్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించాల్సి ఉంది. జిల్లాలో 950 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ భూసేకరణలో భూ యజమానులు అడ్డంకులు కల్పిస్తుండటంతో సర్వే పనులు చాలా ప్రాంతాల్లో నిలిచిపోయాయి. దీంతో రైల్వే లైన్ పనులు ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది. సర్వే అధికారులు సర్వే చేయడం వరకే ఉంటుంది సమస్యను ఆయా ప్రాంతాల రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సి  ఉంటుంది.ఈ ప్రాంతాల్లో భూములు కోల్పోయే రైతులతో రెవెన్యూ యంత్రాంగం మాట్లాడి సమస్య పరిష్కరిస్తే సర్వే పనుల్లో వేగం పుంజుకుంటుంది.

రైలు మార్గం పూర్తయితే మెదక్ ..సిద్దిపేట… కరీంనగర్ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తి ఎగుమతులు, దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా కార్మికులకు లాభం కలగనుంది. హైదరాబాదుకు రాకపోకలు పెరిగి వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడనుంది. హైదరాబాదులో విద్యనభ్యసించే విద్యార్థులకు, వివిధ రకాల వ్యాపారులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయోగపడనుంది. దీంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే వివిధ జిల్లాల భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులకు ఈ రైలు మార్గం ఉపయోగపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -