ఓటమి భయంతోనే సీఎం రేవంత్రెడ్డి బెదిరింపులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్తోపాటు మరికొందరు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్లలోనే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్ ఇచ్చారని వివరించారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందించామని అన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్ ఇలా అన్నీ పథకాలను బంద్ చేసిందని మండిపడ్డారు. ప్రజలనే బెదిరించే స్థాయికి సీఎం రేవంత్రెడ్డి చేరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారనీ, కానీ రేవంత్ రెడ్డి మాత్రం బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. హామీలు అమలు చేయకపోగా గతంలో ఉన్న వాటిని నిలిపేస్తున్నారని చెప్పారు. రేవంత్రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలనీ, దాన్ని మర్చిపోయి రాజులా భావిస్తున్నారని అన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ను నాశనం చేశారని చెప్పారు.. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇండ్లు కూలగొడుతున్నారని అన్నారు. హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ను మళ్లీ తెచ్చుకోవాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలన్నారు. ఈనెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



