స్వాతంత్ర సమరయోధురాలు లక్ష్మీబాయి విగ్రహమే సముచితం..
భారత యాదవ సమితి.. రాష్ట్ర అధ్యక్షుడు, సిద్ధి రమేష్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
హైదరాబాద్ అమీర్పేట్లోని మైత్రివనం పేరు స్నేహానికి, సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రదేశంలో కొత్త విగ్రహ ప్రతిష్ఠ ప్రతిపాదన చర్చనీయాంశమైందని కొందరు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారని, అయితే, ప్రజా చైతన్య వర్గాలు, మహిళా సంఘాలు మాత్రం స్వాతంత్ర సమరయోధురాలు, మహిళా సాధికారతకు ప్రతీక అయిన సంగం లక్ష్మీబాయి యాదవ్ కు గౌరవం ఇవ్వాల్సిన ప్రదేశమని మరో సత్యాన్ని సున్నితంగా గుర్తుచేస్తున్నాయని భారత యాదవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్ యాదవ్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎన్టీఆర్ తన జీవితంలో ప్రజలకు వినోదం, రాజకీయ సేవను అందించారు.అది సందేహమే లేదు. కానీ ఆయన తన ఆస్తిని తన కుటుంబానికే అందజేశారు.అదే సమయంలో సంగం లక్ష్మీబాయి యాదవ్ తన ఆస్తులను, తన సమయాన్ని, తన జీవితాన్నంతా ప్రజలకు, అనాథలకు, పేద మహిళలకు అంకితం చేశారు.
ఇద్దరి జీవితాల మధ్య ఇదే తేడా ఒకరు కుటుంబానికోసం, మరొకరు సమాజానికోసం జీవించారని తెలిపారు.సేవే జీవితం-అంకిత భావం స్వాతంత్ర సమరయోధురాలు మాత్రమే కాదు,సమాజ సేవకురాలు, మహిళా శక్తికి ప్రతీక. ఆమె స్థాపించిన “ఇందిరా సేవాసదన్” అనే అనాథ శరణాలయం అనేక వందల నిరాశ్రయ బాలికలకు ఆశ్రయం ఇచ్చిందన్నారు. రాధికా మెటర్నిటీ హోమ్, వసు శిశువిహార్, మాశెట్టి హనుమంతుగుప్త బాలికల పాఠశాల వంటి సంస్థల స్థాపనలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.తెలంగాణాలో వినోభా భావే యొక్క తొలి భూదాన్ పాదయాత్రకు ఆమె సారథ్యం వహించడం ఆమె సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది.
హైదరాబాదు యాదవ మహాజన సమాజం అధ్యక్షురాలు, అఖిల భారత విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు, ఆంధ్ర యువతి మండలి, ఫుడ్ కౌన్సిల్ అధ్యక్షురాలు, సామాజిక సంక్షేమ సలహా బోర్డు కోశాధికారిగా కూడా సేవలందించారు. ఇంతటి విభిన్న రంగాలలో సేవలు అందించిన మహిళలు దేశ చరిత్రలో అరుదన్నారు.రాజకీయాల్లో కూడా అగ్రగామి 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా ఎన్నికై, 1954 నుండి 1956 వరకు విద్యాశాఖ ఉపమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత వరుసగా 1957, 1962, 1967 లో లోక్సభకు ఎన్నికై, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి మహిళా లోక్సభ సభ్యురాలిగా చరిత్ర సృష్టించారు.
ఆమె రాజకీయాలు అధికారానికి కాదు సేవకు అంకితమైనది. ప్రజల సమస్యలపై ఆమె పార్లమెంట్లో గళమెత్తిన తొలి మహిళా ప్రతినిధులలో చెరగని ముద్ర వేసుకున్నారు.గౌరవం ఎక్కడకు చెందాలో అక్కడ ఇవ్వాలి మైత్రివనం వంటి ప్రాముఖ్య ప్రదేశంలో విగ్రహం అంటే అది ఒక గుర్తింపు, ఒక విలువను సమాజం గుర్తుచేసే మార్గం.అలాంటి ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహం కంటే ప్రజాసేవకురాలు, స్వాతంత్ర సమరయోధురాలు, మహిళా సాధికారతకు మార్గదర్శకురాలు అయిన సంగం లక్ష్మీబాయి యాదవ్ గారి విగ్రహం ఉండడమే న్యాయం, సమాజానికి ప్రేరణ.
ఎన్టీఆర్కు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో విగ్రహాలు, స్మారకాలు ఉన్నాయి. కానీ సంగం లక్ష్మీబాయి యాదవ్ గారి వంటి సత్యమైన సేవకురాలికి, విద్యా-సామాజిక రంగాల పునాదిని వేసిన మహాత్మకు తగిన గుర్తింపు ఇప్పటికీ లభించలేదన్నారు.నిజమైన గౌరవం అంటే ఇదే సంగం లక్ష్మీబాయి యాదవ్ గారు కేవలం యాదవ సమాజానికి చెందిన నేత కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ఆమె జీవితం స్త్రీ శక్తి, సేవా త్యాగం, ప్రజా పరిపాలనలో మహిళల పాత్రకు మార్గదర్శకం. మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన ఆమె విగ్రహం మైత్రివనంలో ఏర్పాటు అయితే అది కేవలం ఒక వ్యక్తికి గౌరవం కాదు, ఒక తరం స్ఫూర్తికి ప్రతీక అవుతుందన్నారు.



