నవతెలంగాణ – హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డేయే కూటమి 202 స్థానాల్లో జయభేరి మోగించింది. ఇక అధికారంలోకి రావాలనుకున్న ప్రతిపక్ష మహాఘఠ్బంధన్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్లలో సంగం కూడా దక్కించుకోలేక చితికిలపడింది. కేవలం 34 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో బీహార్లో ఇండియా కూటమి ఓటమిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఫలితాలు ఇండియా బ్లాక్ కి ఓ పాఠం అని పేర్కొన్నారు. ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్కు కూడా అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల ఫలితాలు సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, రాజకీయ సందేశంపై ఆధారపడి ఉంటాయి. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారు. సవాళ్లను పరిష్కరించేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళిక వేయగల సామర్థ్యం కలిగిన నాయకులు ఉన్నారు. ఈ ఫలితాలు ఇండియా కూటమికి ఓ పాఠం లాంటివి. దీంతో ఎంతో నేర్చుకోవాలి’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై కూడా స్టాలిన్ విమర్శలు చేశారు.



