నవతెలంగాణ కమ్మర్ పల్లి : తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది. మండలంలోని బషీరాబాద్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశాల సమ్మె శనివారంతో 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు బషీరాబాద్ చౌరస్తా వద్ద రాష్ట్ర ఐటీ, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షరాలు శాంతి మాట్లాడుతూ 13 రోజులుగా ఆశా కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైనది కాదన్నారు. ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆశా వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు ప్రభుత్వాలు చాలీచాలని జీతాలు చెల్లించి పబ్బం గడుపుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాలకు ప్రభుత్వం పనికి తగ్గ వేతనం అందించాలని, రూ.18వేల ఫిక్స్డ్ వేతనంతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆశాలకు పని భారం తగ్గించి జాబ్ చార్ట్ 32 రకాల రిజిస్టర్స్ వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు. సీనియర్ ఆశా వర్కర్లను సెకండ్ ఏఎన్ఎంలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లావణ్య, కోశాధికారి సంధ్య, కార్యదర్శి మమత, సహ కారదర్శి లత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.