నవతెలంగాణ – బజార్ హాత్నూర్
నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్ తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ ఇంద్రవర్ధన్, సిఐ గురు స్వామి మాట్లాడుతూ గ్రా మాల్లో యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా, అజాగ్రత్తగా నడపవద్దని కోరారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. యువత చదువుపై శ్రద్ధ వహించాలని, వాహనాలు నడిపే వారు అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకో వాలని సూచించారు. సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని సరైన పత్రాలు లేని వాహనాల పై కేసు నమోదు చేశారు. పలువురితో 22 వేల రూపాయలు పెండింగ్ చలాన్లు కట్టించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సంజయ్ కుమార్, బోత్ ఎస్సై సాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.



