నవతెలంగాణ – జుక్కల్
వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ ఏడిగి రోడ్డు జుక్కల్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం వందేమాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. వందేమాతరం గీతానికి 2025 నవంబర్ 7వ తేదీతో 150 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన ఈ మహోన్నత గీతం యొక్క చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ మహోన్నత గీతాన్ని ప్రముఖ బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ (చటోపాధ్యాయ) 1875లో రచించారు అన్నారు.
వందేమాతరం కేవలం ఒక పాట కాదు, అది స్వాతంత్ర్య సమరయోధులకు ఒక శక్తివంతమైన నినాదంగా, పోరాట స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ నినాదం లక్షలాది భారతీయులను ఏకతాటిపైకి తెచ్చిందని గుర్తు చేశారు. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ఈ గీతాన్ని భారతదేశ జాతీయ గీతంగా ఆమోదించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి విద్యానికేతన్ మేనేజ్మెంట్ మరియు మాజీ ఎమ్మెల్యే అరుణతార మరియు మండల అధ్యక్షులు జనరల్ సెక్రెటరీ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.



