డిసెంబర్ 11, 14,17 మూడు తేదీల్లో విడతలుగా నిర్వహణ
నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఉదయం 7 గంటల నుంచి
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు
తక్షణమే మోడల్ కోడ్ కండక్ట్ అమలు
రేపటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ
డిసెంబర్ 27న ముగియనున్న ఎన్నికల ప్రక్రియ
299 వార్డులు, 32 జీపీల్లో ఎన్నికలు వాయిదా : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిణి
బీసీలకు 2019 కంటే తగ్గిన సర్పంచ్ స్థానాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోటిఫికేషన్ను విడుదల చేశారు. అనంతరం ఎన్నికల ప్రక్రియను ఆమె వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నామని వివరించారు. ఉప సర్పంచ్ ఎన్నికను కూడా అదే రోజు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదటి సారి సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ అక్టోబర్ 9న షెడ్యూల్పై హైకోర్టు స్టే విధించినట్టు తెలిపారు. ప్రస్తుతం రెండవ సారీ విడుదల చేస్తున్న నోటిఫికేషన్ ప్రక్రియ అమల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నోటా అమల్లో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. బందోబస్తు, రవాణా తదితర కారణాల వల్ల మూడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి దశకు రెండు రోజుల వ్యవధి ఇచ్చామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తు న్నందున వ్యవధి వల్ల మొదటి దశ ఎన్నికల ఫలితాలు తర్వాతి ఎన్నికల పై ఉండవని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలి పారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్ని కలకు డిసెంబర్ 3 నుంచి నామినేష న్లు స్వీకరించనున్నట్టు వివరించారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు,38,350 వార్డులకు,మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వ హించనున్నట్టు వెల్లడించారు.రాష్ట్రం లోని 299వార్డులు, 32 గ్రామ పంచాయతీల్లో కోర్టు కేసులు, ఇతర వివాదాల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలిపారు. అందులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాలు, కరీంనగర్ జిల్లా వి.సైదాపూర్ మండలంలోని 2 గ్రామాలు, ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో 4 గ్రామాలు, పెనుబల్లి మండలంలో ఒక గ్రామం ఉన్నాయని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆగిన పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల జీపీ మహేశ్భగవత్,, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తగ్గిన బీసీల సీట్లు
బీసీ సర్పంచ్ స్థానాలు ఈ సారి తగ్గినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించి ప్రభుత్వానికి సమర్పించినా,పంచాయతీరాజ్ శాఖ గాని ఎన్నికల సంఘం గాని రాష్ట్ర వ్యాపిత రిజర్వేషన్ల తుది జాబితాను ప్రకటించలేదు. బీసీ సంఘాలు, ఇతర వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రోటేషన్ పేరుతో రిజర్వేషన్ల ఖరారుతో బీసీలకు అన్యాయం జరిగిందని సమాచారం. 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల కంటే ప్రస్తుతం 2025లో జరిగే ఎన్నికల్లో 600 సీట్లు తగ్గినట్టు తెలు స్తోంది. గతంలో 23శాతం బీసీలకు దక్కగా ఈసారి 18 శాతానికి పడి పోయినట్టు గణాంకాలు చెబుతున్నా యి. 30 మండలాల్లో ఒక్క గ్రామం కూడా బీసీలకు దక్క లేదనీ, 80 మండలాల్లో ఒకటి నుంచి రెండు గ్రామాలు మాత్రమే బీసీలకు దక్కా యని తెలుస్తోంది. రెండు రోజుల్లో రిజర్వేషన్ల పూర్తి వివరాలు తెలుస్తా యని భావిస్తున్నారు.





