బీఆర్ఎస్ 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది
సింగరేణి కార్మికుల రూ.10కోట్లు ఫుట్బాల్లో పెట్టిండ్రు : మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-సంగారెడ్డి,జోగిపేట
రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో సీఎం రేవంత్రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్రావు ఏద్దేవా చేశారు. సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాలలో గెలిచిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులకు శనివారం ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో హరీశ్రావు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, డబ్బులు పంచినా, గుండాయిజం చేసినా అద్భుతంగా ఎదిరించి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటిందని చెప్పారు. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90శాతం గెలిస్తే.. పది శాతం ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయని అన్నారు.
కానీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 శాతం అంటే 4వేలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచిందని తెలిపారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచులను కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 50 శాతంలోపే సర్పంచుల స్థానాలు గెలిచిందని, కానీ ముఖ్యమంత్రి మాత్రం 66శాతం గెలిచామని బుకాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి భవిష్యత్ ఉంటదని, గెలిచిన వారికి బాధ్యత ఉంటుందని చెప్పారు. నిన్నటి వరకు దండం పెట్టి ఓటు అడిగి గెలువంగానే మారిపోకూడదని సూచించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ 10, 12 స్థానాలకు మించి గెలవదని జోస్యం చెప్పారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ కావాలని ఎదురుచూస్తున్నారని చెప్పారు.
పంట పండాలంటే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఎరువులు కావాలన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం అప్పులు కావాలి.. మ్యాప్లు కావాలంటు న్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా వ్యవ సాయం చేసావా? రైతుల కష్టం తెలుసా? అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల 10 కోట్ల డబ్బును సీఎం రేవంత్రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్కి పెట్టిండని ఆరోపించారు. ”ఫుట్బాల్ కోర్ట్ నీ డబ్బుతో కట్టుకో రేవంత్రెడ్డి.. ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేయడం కాదు.. అందాల పోటీలతో, ఫుట్బాల్ పోటీలతో మనకేమైనా వచ్చిందా?” అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం, రాజేందర్, మనోహర్ గౌడ్, చంటి రాహుల్ కిరణ్, నరసింహులు, శివరాజ్ పాటిల్, మధుసూదన్ రెడ్డి, కొండల్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అబద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



