నార్ముల్ మదర్ డెయిరీ చైర్మెన్, బోర్డ్ డైరెక్టర్లు రాజీనామా చేయాలని డిమాండ్
పాల ట్యాంకర్ను అడ్డుకున్న పాడి రైతులు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
పాల బిల్లుల చెల్లింపుల విషయంలో పూర్తిగా విఫలమైన నార్ముల్ మదర్ డెయిరీ చైర్మెన్, బోర్డు డైరెక్టర్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం వద్ద పాల సంఘాల చైర్మెన్లు, పాడి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మదర్ డెయిరీ వద్ద పాల ట్యాంకర్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాల సంఘాల చైర్మెన్లు పసుల సతీష్రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, మైదం రంగయ్య మాట్లాడుతూ.. 9 నెలల పాల బిల్లులను వెంటనే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాల బిల్లులు ఆపితే రైతు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. పాల బిల్లుల చెల్లింపులో పూర్తిగా విఫలమైన మదర్ డెయిరీ చైర్మెన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి, ఎండీ, బోర్డు డైరెక్టర్స్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సంఘీభావం తెలిపిన సీపీఐ(ఎం), ఇతర పార్టీల నాయకులు
పాడి రైతుల ధర్నాకు ఆవాజ్ జిల్లా అధ్యక్షులు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఎ ఇగ్బాల్, బీజేపీ జిల్లా కార్యదర్శి కమిటీ కృష్ణ, ఆలేరు పట్టణ అధ్యక్షులు నంద గంగేష్ సంఘీభావం తెలిపారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించకపోతే రైతులతో కలిసి ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని యాదగిరిగుట్ట దేవస్థానం నెయ్యి కాంట్రాక్టు వెంటనే తిరిగి మదర్ డెయిరీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సోమవారంలోగా పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మదర్ డెయిరీ ఎండీ మొబైల్ ఫోన్ ద్వారా వివరణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల సంఘాల చైర్మెన్లు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, తీపి రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉదరి రాములు, మోటే శ్రీశైలం, మోటే శంకర్, పారెల్లి కృష్ణ, పారెల్లి సత్యనారాయణ, దడిగే రాములు, టంగుటూరు చంద్రయ్య, చీరబోయిన రాజయ్య పాల్గొన్నారు.



