– శాసనసభలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన వేముల
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అసెంబ్లీ మొదటి రోజు సమావేషాల్లో భాగంగా జీరో అవర్ లో భీంగల్ మున్సిపాలిటీకి సంబందించిన 100 పడకల హాస్పిటల్, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనుల పురోగతి, పెండింగ్ బిల్లులు చెల్లింపు అంశాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. శాసన సభలో ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆస్పత్రి మంజూరు అయ్యిందని, దాదాపు 80 శాతం పనులు కూడా పూర్తయినట్లు తెలిపారు.స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగిందని,హాస్పిటల్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వారందరు వేరే ఒక దగ్గర అడ్జస్ట్ అయ్యి పని చేయాల్సి వస్తుందని వివరించారు.
ఈ ప్రభుత్వం వచ్చాక గత రెండు సంవత్సరాలుగా అక్కడ అసలు పనులేమీ జరగటం లేదన్నారు.రూ.35 కోట్లతో మంజూరై దాదాపు రూ.30 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. వాటి బిల్లులను చెల్లించడంతో పాటు మిగిలిన 5 కోట్లు విడుదల చేసి ఖర్చు చేసినట్లయితే పేద ప్రజలకు వైద్యం అందించడానికి వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది అని ఎమ్మెల్యే సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చారు. వెంటనే 100 పడకల హాస్పిటల్ పెండింగ్ బిల్స్ ఇవ్వాలని,మిగిలిన 5 కోట్లు విడుదల చేసి హాస్పిటల్ నిర్మాణం పనులు పూర్తి చేయాలనీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదరా రాజ నర్సింహను కోరారు.
భీంగల్ మున్సిపాలిటీలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. భీంగల్ మున్సిపాలిటీలో కూరగాయల మార్కెట్ రోడ్డుపై నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వ హయంలో రూ.3.5 కోట్లతో భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ బిల్డింగ్ మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.దాదాపు పనులన్నీ పూర్తి దశలో ఉన్నాయి కానీ, ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పనులన్నీ ఎక్కడికి అక్కడ ఆగిపోయి పనులేమీ జరగటం లేదన్నారు.కాంట్రాక్టర్ ను అడిగితే బిల్స్ రావడం లేదని అంటున్నాడు, బిల్స్ తొందరగా ఇప్పించి మిగిలిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ప్రశాంత్ రెడ్డి కోరారు.



