అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు
రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లెల్లో కలెక్టరేట్లు ప్రారంభం
అమరావతి : పండగ వాతావరణంలో బుధవారం రెండు కొత్త జిల్లాల ఆవిర్భావం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రం మారింది. రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లెల్లో కొత్త కలెక్టరేట్లు ప్రారంభమయ్యాయి. కొత్త జిల్లాల్లో కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పిలు కొలువుదీరారు. రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లా కలెక్టర్ను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్, అల్లూరి జిల్లా కలెక్టర్ ఎఎస్.దినేష్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ప్రజాసంఘాలు, వివిధ పార్టీల ప్రతినిధులు, వివిధ గిరిజన సంఘాల పోరాట ఫలితంగా, ఏజెన్సీ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చేందు కు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసిందన్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ల లోని గిరిజనులు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు వెళ్లాలంటే సుమారు 250 కిలోమీటర్ల దూరం వ్యయ, ప్రయాసలకోర్చి ప్రయాణించాల్సి వచ్చేందని, ఇకనుండి ఈ ప్రాంతాల వారికి రంపచోడవరం కలెక్టరేట్ నుంచే ప్రభుత్వ సేవలు అందనున్నాయని తెలిపారు.
గుర్తేడు మండలాన్ని ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిందన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రస్తుతం రూ.5 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ ఎస్.బొజ్జిరెడ్డి, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శ్రీనివాస రావు, అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్, పోలవరం ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం ఐటిడిఎ పిఒ స్మరణ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరంలోని పిఎంఆర్సిలో నూతన ఎస్పి కార్యాలయం ఏర్పాటైంది. ఇన్ఛార్జి ఎస్పిగా అల్లూరి జిల్లా ఎస్పి అమిత్ బర్దర్ బాధ్యతలు స్వీకరించారు.మార్కాపురం పట్టణ శివారులోగల ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పాఠశాల భవనాల సముదాయంలో ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా కలెక్టరేట్ను ఇన్ఛార్జి కలెక్టర్ పి.రాజాబాబుతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హామీ ఇచ్చిన మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రజల, రైతుల తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతామన్నారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు, మారిటోరియం చైర్మన్ దామచర్ల సత్య తదితరులు మాట్లాడారు. ఇన్ఛార్జి కలెక్టర్గా పి.రాజాబాబు, జిల్లా ఇన్ఛార్జి ఎస్పిగా వి.హర్షవర్ధన్రాజు బాధ్యతలు చేపట్టారు.
ఏపీలో 2 కొత్త జిల్లాల ఆవిర్భావం
- Advertisement -
- Advertisement -



