జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్
రోడ్డు మాసోత్సవాల సందర్భంగా వాహనాల తనిఖీ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ సిబ్బంది శుక్రవారం వేములవాడ కమాన్ వద్ద కార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని కార్ల వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి నడపవద్దని, రాంగ్ రూట్ లో వెళ్లకూడదని, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు.
స్పీడ్ కంట్రోల్ లో ఉండాలని, వాహనం రివర్స్ లో వెళ్లేప్పుడు తప్పనిసరిగా వాహనం కింద, వెనుక గమనించాలని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకుని వాహనాన్ని నడిపిన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలను నడిపిన వారికి దాని ప్రాముఖ్యత గురించి తెలిపారు. వాహనాలకు వాహన భద్రతా స్టిక్కర్లు అతికించారు. సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనం నడుపుతామని వాహన దారులతో రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, మోటార్ వాహనాల సహాయక తనిఖీ అధికారి రజిని, పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


