ముఖం మీద ఉమ్మేసినా, తుడుచుకుని పోయే సిగ్గుశరం లేని రకం ఇది. బండ బూతులు తిట్టినా నిండు కుండలా కదలని మెదలని జీ హుజూర్ బాపతు. ఇంకా ఏం అనాలి? అంత బానిసగా, చవటగా మారారా! సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని సైతం సవాల్ చేసి గడగడలాడించిన వీరపాండ్య కట్టబ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్ మొదలైన వీరులు పుట్టిన నేలను ఏలుతున్న నాయకుడివేనా నువ్వు! నీ పిరికిపంద చర్యలకు, నూట నలభై ఆరు కోట్ల మంది అవమాన భారంతో కుంగిపోవాలా! ఒక్క మాట తల ఎత్తి బదులు పలకలేని బలహీన దిగజారుడుతనాన్ని చూసి నిజంగానే సిగ్గు పడుతున్నాం. బహిరంగంగా జాతి జనులను అవమానపరుస్తూ, జాత్యహంకారపు కూతలు కూస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు, పౌరుషం లేని నిస్తేజపు మనిషిలా చేతులు నోటిని వ¶సేసుకోవటం ఎంత అవమానకర చర్య. ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో కూడా, నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి తలొగ్గి క్షమాపణలు రాసిచ్చిన, ఉద్యమం చేయమని చెప్పిన, గొంతు విప్పమని పలికిన వారసత్వం కదా! మీది. ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతి జనుల కోసం మీరు ఏం మాట్లాడగలరు? లొంగిపోవడం మీ దినచర్య.
భారత్, చైనాలను నరకకూపాలుగా పేర్కొంటూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఫార్వార్డింగ్ అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం కల్పన ద్వారా ఇక్కడ పుట్టిన బిడ్డ అమెరికన్ పౌరుడిగా మారతాడని, ఆ తర్వాత, భారత్, చైనా ఇతర నరకకూపాల నుంచి వారి మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తారని అమెరికాలోని రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్, భారతీయులు, చైనీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. భారతీయ వలసదారులను ”గ్యాంగ్స్టర్స్ విత్ లాప్టాప్స్” అని అభివర్ణించాడు. మాఫియా కుటుంబాలు ఈ దేశానికి చేసిన నష్టం కన్నా వీరే ఈ దేశానికి ఎక్కువ నష్టం చేస్తారని ఆరోపించాడు. సావేజ్ చేసిన ఈ ఆరోపణలు, అవమానకర పోస్టులను, ట్రంప్ సమర్థిస్తూ ఆ మాటలనే రీపోస్ట్ చేశాడు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడే ట్రంప్, భారతీయులను కించపరుస్తూ చేసే వ్యాఖ్యలను తను తిరిగి పోస్ట్ చేయటమంటే, అతని భావన కూడా అదేనని చెప్పాడు. ఇంకా సావేజ్ ఏమన్నాడంటే, అమెరికాలో పుట్టుక ద్వారా వచ్చే జన్మహక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరుతున్నాడు. చైనా, భారత్ దేశాల ప్రజలు తొమ్మిదవ నెలలో బిడ్డను కనడానికి అమెరికాకు వస్తారని, ఆ పుట్టిన బిడ్డలను ‘యాంకర్ బేబీస్’ అని అభివర్ణించాడు. ఇంత చులకనగా మన దేశ ప్రజలను కించపరుస్తూ మాట్లాడితే, మన ధీరగంభీర ప్రధానమంత్రి గారు, ఏ మాత్రం చలనం లేకుండా గమ్మున ఉండిపోయారు. ఇది మొదటిసారి కాదు, అంతకు ముందు భారతీయులు తిండిబోతులు అని అన్నారు. ఇండియా డెడ్ ఎకానమీ అన్నారు. అయినా స్పందన లేదు మనకు.
మేము దేశభక్తులం, భారతీయత మా ఆత్మ అని వీరరాగాలు తీసే సంఘ పరివారం గానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఈ అవమానకర వ్యాఖ్యలపై తూతూ మంత్రంగానైనా స్పందించలేదు. వారి దేశభక్తి అంతా ఏమైపోయిందో మరి! ఎంత అహంకార పూరితమైన మాటలు. మన దేశాన్ని నరకం అంటాడా ట్రంప్. ల్యాప్టాప్లు పట్టుకుని మనవాళ్లు ఈ నరక కూపం నుండి తప్పుకుపోతున్నారా? దేశభక్తుడిగా చిలక పలుకులు పలికే ప్రధాని, విశ్వగురువుకు కోపం రాదు, రోషం లేదు. అన్ని అమెరికాకు తాకట్టు పెట్టాడు. స్థానిక రాష్ట్రాల ఎన్నికలలో ఈ రంగులు మారుస్తూ అబద్ధాలు వల్లించే పనిలో నిమగమయ్యాడు. విదేశాంగ శాఖ మాత్రం సరైన మాటలు కావని సున్నిత వ్యాఖ్యానం చేసింది. ఈ ట్రంప్, అమెరికా మాటలకు ఇరాన్ ధీటైన సమాధానం చెప్పింది. ‘ఇండియా చైనాలు మహోన్నత దేశాలు. నాగరికతలకు పుట్టినిల్లు’ అని చెప్పింది. మనమేమో ఆ దేశంపై అమెరికా దాడిని కనీసం ఖండించం. ఇదీ మన విశ్వగురువు నీతి, దేశభక్తి! ఇంతకన్నా ఈ దేశానికి అవమానకరం ఏముంది?
దేశానికి అవమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



