ఇరాన్ జాబితా అందజేత
అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఉండవు
పాక్ అధికారులతో
ఇరాన్ విదేశాంగమంత్రి అరాగ్చీ భేటీ
చర్చల కోసం పాక్కు వెళ్లొద్దు : అమెరికా ప్రతినిధులకు ట్రంప్ ఆదేశం
ఇస్లామాబాద్ : ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం పాకిస్తాన్ అధికారులతో ఇస్లామబాద్లో సమావేశమయ్యారు. మరోవైపు ఇరాన్తో శాంతి చర్చల నిమిత్తం అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఇస్లామాబాద్ చేరుకుంటు న్నారు. చర్చలలో పురోగతి కన్పిస్తే అమెరికా ఉపా ధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇస్లామాబాద్ వస్తారు. అయితే అమెరికాతో ప్రత్యక్ష చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖై స్పష్టం చేశారు. యుద్ధం ముగించాలంటే ప్రతిపాదిత డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని ఇరాన్ స్పష్టం చేసింది. వారిచ్చిన అభిప్రాయాలు, ఆందోళనలను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు చేరవేస్తామని ఆయన చెప్పారు. చర్చలపై ఇరాన్, అమెరికా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండడంతో గందరగోళం నెలకొంది. అసలు శాంతి చర్చలు జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చర్చల విషయంలో ఇరాన్ వైపు నుంచి ‘కొంత పురోగతి’ కన్పిస్తోందని శ్వేతసౌధం చెబుతోంది. అమెరికా డిమాండ్లను నెరవేర్చే విషయంలో ఇరాన్ తమకు ఓ ఆఫర్ ఇస్తుందని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ వివరాలు మాత్రం తెలియవని అంటున్నారు. ఇరాన్ ఆఫర్ను పరిశీలి స్తామని ఆయన చెప్పారు. యురేనియం శుద్ధి కార్యక్ర మానికి ఇరాన్ స్వస్తి చెప్పాల్సి ఉంటుందని, హార్ముజ్ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేం దుకు వీలు కల్పించాలని, అప్పుడే ఒప్పందం సాధ్యప డుతుందని స్పష్టం చేశారు. కాగా అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరిపే అంశం తమ ఎజెండాలోనే లేదని ఇరాన్ మీడియా కుండబద్దలు కొట్టింది. పాకిస్తాన్ పర్యటనలో అరాగ్చీ ‘అణు చర్చలు’ జరపబోరని, కేవలం ద్వైపాక్షిక అంశాలనే ప్రస్తావిస్తారని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహిం అజిజి తెలిపారు. అరాగ్చీ తన పర్యటనలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైనిక దళాల ప్రధానాధికారి అశిం మునీర్తో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇదిలావుండగా అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇరు పక్షాలను చర్చల వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది.
చైనా చమురు రిఫైనరీపై ట్రంప్ ఆంక్షలు
చైనాకు చెందిన ఓ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇరాన్ చమురును రవాణా చేస్తున్నాయన్న కారణం తో నలభై షిప్పింగ్ కంపెనీలు, నౌకలపై కూడా ఆంక్ష లు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాలపై సెకండరీ ఆంక్షలు విధిస్తానంటూ ట్రంప్ ప్రభుత్వం ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్కు కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను అడ్డుకోవాలన్న అమెరికా ప్రభుత్వ ప్రణాళికలో ఈ ఆంక్షలు భాగమేనని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. అంతర్జాతీయ ఇంధన సరఫరాలకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని అమెరికా ఇప్ప టికే దిగ్బంధించిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ మధ్య కొద్ది వారాలలో బీజింగ్లో చర్చలు జరగనున్న తరుణంలో ఈ ఆంక్షలు అమలులోకి రావడం గమనార్హం.
తాజాగా అమెరికా ఆంక్షలకు గురైన వాటిలో… ఓడరేవు నగరమైన డాలియన్లోని హెంగ్లీ పెట్రో కెమికల్ కేంద్రం ఉంది. ఇది రోజుకు సుమారు నాలు గు లక్షల బ్యారల్స్ ముడి చమురును ప్రాసెస్ చేస్తుం ది. చైనాలోని అతి పెద్ద స్వతంత్ర రిఫైనరీలలో ఇది ఒకటి. హెంగ్లీకి 2023 నుంచి ఇరాన్ ముడి చమురు నౌకలు వస్తున్నాయని అమెరికా ఆర్థికశాఖ తెలిపింది. ఇది ఇరాన్ సైన్యానికి వందల మిలియన్ల ఆదాయాన్ని సమకూర్చిందని ఆరోపించింది.ఓ ఇరాన్ వ్యతిరేక గ్రూప్ ప్రకారం టెహ్రాన్ చమురును కొనుగోలు చేస్తు న్న అనేక చైనా కేంద్రాలలో హెంగ్లీ ఒకటి. ఇరాన్ తన చమురును అంతర్జాతీయ మార్కె ట్లకు తరలించేం దుకు నౌకలు, మధ్యవర్తులు, కొనుగోలుదారులపై ఆధారపడుతోందని, వారందరి నెట్వర్క్ పైన ఉచ్చు బిగిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ చెప్పారు.
ఇరాన్తో వ్యాపారంచేస్తే సెకండరీ ఆంక్షలు విధి స్తామంటూ అమెరికా ఆర్థికశాఖ ఈ నెల ప్రారంభం లో చైనా, హాంగ్కాంగ్, యూఏఈ, ఒమన్ దేశాల లోని ఆర్థిక సంస్థలకు లేఖలు రాసింది. ఆయా దేశా లు ఇరాన్ చట్టవిరుద్ధ కార్యకలాపాలను అనుమతిస్తు న్నాయని ఆరోపించింది. ఇరాన్ చమురును కొను గోలు చేస్తే…ఇరాన్ సొమ్ము మీ బ్యాంకులకు చేరితే సెకండరీ ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నా మని బెస్సెంట్ ఈ నెల 15న విలేకరుల సమావేశం లో ఆయా దేశాలకు సంకేతాలు పంపారు.
పర్షియన్ గల్ప్లో చమురు, సహజవాయువు నౌకల రవాణాకు అంతరాయం ఏర్పడుతుండడంతో అంత ర్జాతీయ ఇంధన వాణిజ్యం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొం టోంది.ఈ పరిస్థితులలో అమెరికా విధిం చిన ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
ట్రంప్ అభిశంసనకు డెమొక్రాట్ల సన్నాహాలు
యూఎస్ ప్రతినిధుల óసభలో మెజారిటీ సాధించిన పక్షంలో దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను అభిశంసిం చేందుకు భావసారూప్యత కలిగిన డెమొక్రాట్లు సన్నాహాలు ప్రారంభించారు. సవివరమైన అభిశం సన తీర్మానాన్ని సిద్ధం చేయాలని వారు పార్టీ నాయ కత్వాన్ని కోరారు. ప్రతినిధిసభపై డెమొక్రాట్లు పట్టు సాధించిన వెంటనే దానిని ముందుకు తీసుకొని వెళ్లవచ్చునని ఆ శిబిరంలోని సభ్యులు అభిప్రాయ పడ్డారు. ‘మాకు అత్యంత నిర్దిష్టమైన, సమన్వ యంతో కూడిన వ్యూహం అవసరం’ అని డెమొక్రటిక్ సభ్యుడు డెలియా రమిరెజ్ చెప్పారు. ఎన్నికలకు ముందే అభిశంసన తీర్మానానికి అవసరమైన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. జనవరిలో అధికారంలోకి రాగానే అభిశంసన ప్రక్రియను మొదలు పెడతామని ఇల్లినాయిస్కు చెందిన రమిరెజ్ అన్నారు. సభలో డెమొక్రాట్లకు మెజారిటీ వస్తే అభిశంసనకు మంచి అవకాశం ఉంటుందని మరో సభ్యుడు ఎస్సామిన్ అన్సారీ చెప్పారు. ట్రంప్ను అభిశంసించాలన్న యోచనను మెజారిటీ అమెరికన్లు సమర్ధిస్తున్నారు. వెరాసైట్ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం యాభై ఐదు శాతం మంది ట్రంప్ను అభిశంసించాలని అభిప్రాయపడ్డారు. కేవలం 37 శాతం మందే వ్యతిరేకించారు. సంవత్సరం క్రితం ట్రంప్ను అభిశంసించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గత జూన్లో ట్రంప్ను అభిశంసించాలన్న ప్రతిపాదనపై ఓటింగ్ జరిగినప్పుడు అనేక మంది డెమొక్రటిక్ సభ్యులు రిపబ్లికన్లతో చేయి కలిపి వ్యతిరేకంగా ఓటేశారు. డెమొక్రాట్లలో 128 మంది ట్రంప్ అభిశంసనను వ్యతిరేకించగా కేవలం 78 మంది మాత్రమే సమర్ధించారు. అయితే అప్పటి నుంచి పరిస్థితులు గణనీయంగా మారిపోయాయి. ట్రంప్ అభిశంసనకు గత డిసెంబరులో తీర్మానం ప్రవేశపెట్టగా 140 మంది డెమొక్రాట్లు సమర్ధించారు. అయితే ఇప్పటికీ ఆ పార్టీలో ఊగిసలాట కొనసాగుతోంది. ఎందుకంటే సెనెట్లో తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఆ మెజారిటీ ఇప్పుడున్న పరిస్థితులలో సాధ్యం కాదు. కాబట్టే గతంలో చేసిన అనేక అభిశంసన ప్రయత్నాలు ఫలించలేదు.
చర్చల కోసం పాక్కు వెళ్లొద్దు
అమెరికా ప్రతినిధులకు ట్రంప్ ఆదేశం
ఇరాన్తో రెండో విడత చర్చల కోసం అమె రికా ప్రతినిధి బృందం పాకిస్తాన్కు వెళ్లనున్నట్టు వైట్హౌస్ వర్గాలు తొలుత ప్రకటించాయి. దీంతో పాక్కు బయలుదేరేందుకు సిద్ధమవుతోన్న సమ యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చర్చలకోసం తమ బృం దాన్ని పాక్కు వెళ్లొద్దని ఆదేశించినట్టు వెల్లడిం చారు. అమెరికా మీడియా సంస్థతో మాట్లాడు తూ ఫలితంలేని చర్చలకోసం అంతదూరం వెళ్ల వద్దని తమ బృందానికి చెప్పానన్నారు. అయితే, వాళ్లు (ఇరాన్) ఎప్పుడైనా తమను సంప్రదించ వచ్చని పేర్కొన్నారు.
టెహ్రాన్ ఎయిర్పోర్ట్లో కమర్షియల్ సర్వీసులు ప్రారంభం
యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
మొస్సాద్ ఏజెంటును ఉరితీసిన ఇరాన్
ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ తరఫున పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఇరాన్ ఉరితీసింది. ప్రభుత్వ మీడియా సంస్థ తస్నిమ్ న్యూస్ అందించిన సమాచారం ప్రకారం ఎర్ఫాన్ కైనీ అనే వ్యక్తిని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ నియమించింది. అతను ఇస్ఫహాన్ నగరంలో జరిగిన నిరసనల సందర్భంగా విధ్వంసం, గృహ దహనాలు, హింసాకాండకు పాల్పడ్డాడు. అతనిపై చట్టపరమైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించడంతో శనివారం ఉదయం దానిని అమలు చేశారని తస్నిమ్ తెలిపింది. ఇదిలావుండగా కుర్దిస్తాన్, కెర్మన్షా రాష్ట్రాలలో జరిపిన ఆపరేషన్లో సుమారు 240 మందిని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) అరెస్ట్ చేసింది. అనుమతి లేకుండా హార్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకలను ఐఆర్జీసీ ఇటీవల స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన చిత్రాలను అది శుక్రవారం విడుదల చేసింది. కాగా యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా టెహ్రాన్లోని ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు శనివారం ప్రారంభమయ్యాయి.
నేను లేకుంటే ఏం ?
ట్రంప్ మీతో నేరుగా మాట్లాడతారు కదా : పాత్రికేయులతో శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి జోక్
శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తన బాస్ డోనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతోంది. లీవిట్ త్వరలోనే ప్రసూతి సెలవుపై వెళుతున్నారు. ఆమె తన రెండో బిడ్డకు మేలో జన్మనిచ్చే అవకాశం ఉంది. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చలోక్తులు విసిరారు. ‘నేను లేకపోయినా మీకేమీ ఇబ్బంది లేదు కదా. మీ అందరి వద్ద దేశాధ్యక్షుడు ట్రంప్ ఫోన్ నెంబర్ ఉన్నదని నాకు తెలుసు. కాబట్టి నేను సెలవులో ఉన్నప్పటికీ మీకు ఈ భవనం నుంచి ప్రకటనల కొరత ఏమీ ఉండదు’ అని వ్యాఖ్యానించారు. పత్రికా కార్యదర్శి లేకపోయినా ట్రంప్ అనేక సందర్భాలలో విలేకరులను ఉద్దేశించి ప్రసంగించిన విషయాన్ని ‘ది మిర్రర్’ పత్రిక గుర్తు చేసింది.
అమెరికాతో ఒప్పందాన్ని ఇష్టపడని ఇరాన్ నేతలను చంపేయండి
వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ పోస్టును షేర్ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెర లేపారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇష్టం లేని ఇరాన్ నేతలను హతమార్చాలంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కాలమిస్ట్ మార్క్ థిస్సెన్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో పెట్టిన పోస్టును ట్రంప్ ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. ‘ఇరాన్లో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఒప్పందాన్ని కోరుకుం టోంది. రెండో వర్గం వద్దంటోంది. ఒప్పందాన్ని వ్యతిరే కించే వారిని మట్టు పెట్టాలి’ అని థిస్సెన్ తన పోస్టులో వ్యాఖ్యానించారు. దీనిని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో షేర్ చేసిన ట్రంప్పై ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై మండిపడ్డారు. ఇది తీవ్రమైన నైతిక పత నానికి ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలను ప్రోత్సహించడం ద్వారా అమెరికా హింసను, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. ‘ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు, మానవ విలువలకు ఒకప్పుడు ఛాంపియన్గా చెప్పుకున్న అమెరికా ఇప్పుడు ఉగ్రవాదాన్ని, హత్యలను, మూకుమ్మడి హింసను ప్రోత్సహిస్తోంది’ అని ఆరోపించారు.
లెబనాన్పై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు
కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ దక్షిణ లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఆగడం లేదు. బింట్ బెయిల్ నగరంలోని అనేక భవనాలను ఇజ్రాయిల్ దళాలు శనివారం ఉదయం పేల్చి వేశాయని అల్ జజీరా వార్తా సంస్థ తెలియజేసింది. కాగా దక్షిణ లెబనాన్లో ఇజ్రాయిల్ జరిపిన తాజా దాడులలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
పాక్ ఆర్మీ చీఫ్తో అరాగ్చీ భేటీ
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి అశిం మునీర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజమ్ ఘబాబదీ, విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై, రాయబారి రెజా అమిరి మొఘదమ్ కూడా హాజరయ్యారని సామాజిక మాధ్యమంలో ఇరాన్ విదేశాంగ శాఖ పోస్ట్ చేసిన వీడియోను బట్టి తెలుస్తోంది. పాకిస్తాన్ పక్షాన హోం మంత్రి మంత్రి మొహసిన్ నఖ్వీ, ఇతర అధికారులు హాజరయ్యారు.



