కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఏప్రిల్ 29(బుధవారం)న రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. తొలి విడతలో 152 స్థానాలకు ఈనెల 23న పోలింగ్ జరగ్గా..రికార్డు స్థాయిలో (92 శాతం) ఓటింగ్ నమోదైంది. రెండో విడతలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనున్నది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ, సీపీఐ(ఎం) విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి. అయితే రెండో విడతలో కీలకమైన 110 అసెంబ్లీ స్థానాలు ఎటువైపు మొగ్గు చూపితే అధికారం ఆ పార్టీకి వరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రెండో విడత ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా బలగాలు మోహరింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. దేశంలో కీలకమైన రాష్ట్రం కావటంతో అన్ని పార్టీలు గెలుపునకు ప్రయత్నిస్తున్నాయి.



