Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌ ప్రమాణం

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌ ప్రమాణం

- Advertisement -

హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఎట్టకేలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కోరిక నెరవేరింది. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్‌ కోదండరాంతోపాటు మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ సోమవారం శాసనమండలి సభ్యులు(ఎమ్మెల్సీగా) ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఇరువురికి అభినందనలు తెలియజేశారు. గవర్నర్‌ కొటాలో కోదండరాం, అజహరుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు మాట్లాడారు.

నాకు మంత్రి పదవిపై ఆశ లేదు: కోదండరాం
తనకు మంత్రి పదవిపై ఆశ లేదని ఎమ్మెల్సీ కోదండరాం వ్యాఖ్యానించారు. పదవులు అనేవి శాశ్వతం కాదని అభిప్రాయపడ్డారు. ఒకాయన తాను పోరాడుతానా ? లేదా ? అని అన్నారన్నారు. తాను పోరాడి చూపిస్తానని స్పష్టం చేశారు. గతంలో తనపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తన పని ఆగలేదనీ, కొనసాగుతోందని గుర్తుచేశారు. వివాదాస్పద సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. లక్ష్యాలను ఎంచుకొని పనిచేస్తానని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యమకారులతోపాటు ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని అన్నారు. ఇప్పటివరకు చేస్తున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి తనకు ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుందని వివరించారు. జయశంకర్‌కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతానని హామీనిచ్చారు. గతంలో ఏ రకంగా తన జీవన శైలి ఉందో, భవిష్యత్తులోనూ అదేవిధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కా రం కోసం తాను నిలబడతాననీ, వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటానని కోదండరాం పేర్కొన్నారు

మైనార్టీల అభివద్ధి కోసం కృషి చేస్తా : మంత్రి అజహరుద్దీన్‌
తాను కెప్టెన్‌ కాదనీ, తమ కెప్టెన్‌ సీఎం రేవంత్‌రెడ్డి అని మంత్రి అజహరుద్దీన్‌ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో క్లీన్‌బౌల్డ్‌ ఉండదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో చూస్తూ, ఆడుకుంటూ వెళ్లాలని అన్నారు. తనకు పొలిటికల్‌ ఫ్యాన్స్‌ కంటే, క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎక్కువ అని చెప్పారు. పొలిటికల్‌ ఫ్యాన్స్‌ను కూడా తాను పెంచుకుంటానని తెలిపారు. తనకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ పెద్దలు సైతం తనకు సహకరించారని చెప్పారు. ప్రజల కోసం ఇంకా కష్టపడి పని చేస్తానని హామీనిచ్చారు. మైనార్టీల అభివద్ధి కోసం కషి చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మైనార్టీల కోసం చాలా పథకాలు. పనులు చేశారని గుర్తుచేశారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలు సహాజమేనని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -