ప్రతిష్టంభనలో ఉన్న కాల్పుల విరమణ చర్చలు ఫలప్రదమయ్యేందుకు తాజాగా ఇరాన్ ముందుకు తెచ్చిన మూడు ప్రతిపాదనలను డోనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లుగా వార్తలు. హార్ముజ్ జలసంధికి మరోవైపున ఉన్న ఓమన్, రష్యా అధినేత వ్లదిమిర్ పుతిన్తో చర్చించిన తరువాత టెహరాన్ తన ప్రతిపాదనలను పాకిస్తాన్కు అందచేసింది. వాటి మీద తమ నేత సంతోషంగా లేరని అధ్యక్ష భవనపు మీడియా అధికారిణి కరోలిన్ వెల్లడించారు. సోమవారం నాడు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచీ సెంట్ పీటర్స్బర్డ్లో భేటీ తరువాత ఇరాన్, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల ప్రయోజనాలకు తద్వారా సాధ్యమైనంత త్వరలో మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనేందుకు తాము చేయాల్సిం దంతా చేస్తామని పుతిన్ హామీ ఇచ్చాడు. తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే వెంటనే చర్చలకు సిద్ధమే అని ఇరాన్ ప్రకటించింది. వాటి గురించి లెబనాన్, ఇతర మీడియాల్లో వచ్చిన వార్తలను బట్టి మూడు ప్రతిపాదనల సారాంశం ఇలా ఉంది. ఇరాన్, లెబనాన్పై అమెరికా- ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను వెంటనే నిలిపి వేయాలి, భద్రతకు హామీ ఉండాలి. ఇది జరగకుండా ఈ దశలో చర్చలకు ఇరాన్ సిద్ధం కాదు.
ఈ మొదటి దశ మీద అంగీకారం కుదిరిన తరువాత రెండవ దశలో హార్ముజ్ జలసంధి నిర్వహణ గురించి చర్చలు ముందుకు పోతాయి, ఓమన్తో సమన్వయం చేసుకుని నూతన చట్టపరమైన పరిధి గురించి ఇరాన్ ముందుకుపోయే అంశం గురించి చర్చలు జరుగు తాయి. ఆ తరువాత అణుశుద్ది, సంబంధిత సమస్యలపై చర్చకు ఇరాన్ ముందుకు వస్తుంది. దీని అర్ధాన్ని సూటిగా చెప్పుకోవాలంటే లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఆగిపోవాలి, హార్ముజ్ జలసంధిని చెరపట్టిన అమెరికా విరమించాలి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ పెదవి విరిచినట్లు వార్తలు రావటంతో చమురు మార్కెట్లో బ్రెంట్ రకం ధర 111డాలర్లకు అటూ ఇటూగా పెరిగింది. అంతకుముందు జరిగిన పరిణామాల్లో రెండవసారి చర్చలకు ఇస్లామాబాద్ వచ్చిన ఇరాన్ ప్రతినిధి వర్గం అమెరికన్ల కోసం ఎదురు చూడకుండా వెనుదిరిగి వెళ్లిపోయింది.
దాంతో అమెరికా ప్రతినిధులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. రెండవసారి చర్చలు జరగాలంటే జలసంధి దిగ్గంధనాన్ని ట్రంప్ విరమించాలని ఇరాన్ పదే పదే చెప్పింది. ఇప్పటి వరకు తాము 38 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ కేంద్రం సోమవారం ఉదయం పేర్కొన్నది. మార్చినెల 2 నుంచి ఇజ్రాయిల్ దాడుల్లో 2,521మంది తమ పౌరులు మరణించారని, 7,804 మంది గాయపడినట్లు లెబనాన్ తెలిపింది. ఏప్రిల్17న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించినా ఇజ్రాయిల్ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతూనే ఉంది. అక్కడ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్న హిజబుల్లా ఆ ఒప్పందాన్ని అంగీకరించటం లేదని ప్రకటించింది.
బలహీనత ఏమిటో తెలిసిన తరువాత ఐరోపా దేశాలు డోనాల్డ్ ట్రంప్ను, అమెరికాను ఒకఆట ఆడుకుంటున్నాయంటే అతిశయోక్తికాదు. ఇప్పటివరకు నోటి దురుసుతనంతో ట్రంప్ అనేక విధాలుగా నాటో కూటమి దేశాలను అవమానించాడు, బెదిరించాడు. ఇప్పుడు లోపల దాచుకున్నదంతా ఐరోపా నేతలు బయటకు వెళ్లగక్కుతున్నారు. రానున్న రోజుల్లో సంబంధాల గురించి సంయమనం పాటిస్తున్నారు. అమెరికా- ఐరోపా మిత్రుల మధ్య ఉన్న విభజన మరింత పెరగటం కనిపిస్తున్నది. దానికి నిదర్శనమే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ సోమవారం నాడు అసాధా రణంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో మాదిరి ఊబిలో దిగేట్లుగా వాషింగ్టన్ వైఖరి ఉన్నదని, ఎలాంటి వ్యూహం లేకుండా దాడులకు దిగిందని, అదే ఇప్పుడు పరిస్థితిని సంక్లిష్టం గావించిం దని చెప్పటం మూమూలు విషయం కాదు. ఇరాన్ పైచేయి సాధిస్తున్నదని, యావత్ ఐరోపా ఆర్థికంగా ప్రతికూలతను ఎదుర్కొంటున్నదని కూడా మెర్జ్ చెప్పాడు. అందరూ అనుకున్న దాని కంటే ఇరాన్ బలంగా ఉందని, దాని నాయకత్వం అమెరికాను అవమానించిందని కూడా మొహమాటం లేకుండా చెప్పాడు. మిత్రదేశాలు ప్రయివేటు వ్యవహారంగా ఎంతో కాలం ఇబ్బందులను మూసి పెట్టుకోలేవని ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ నేత చెప్పాడు.
వివాదాల్లో దిగటం కాదు, దాన్నుంచి బయటకు కూడా రావాలి, సంఘర్షణలతో తలెత్తే సమస్యలు ఇలాగే ఉంటాయి, ఎంతో బాధాకరంగా ఇరవై ఏండ్లు ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో కూడా చూశామని మార్స్బెర్గ్ అనే పట్టణంలో విద్యార్ధుల సమావేశంలో చెప్పాడు. ఇరానియన్లు ఎంతో నైపుణ్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు లేకపోతే ఎంతో సమర్ధవంతంగా చర్చలు జరపటం లేదని కూడా వర్ణించవచ్చు. అమెరికన్లను ఇస్లామాబాద్కు రప్పిస్తున్నారు, ఎలాంటి ఫలితాలు లేకుండానే వెనక్కు పంపిస్తున్నారు,ప్రత్యేకించి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అని పిలిపించుకొనే వారు యావత్ అమెరికాను అవమానపరిచారని ఆరోపించాడు. జలసంధిలో అమర్చిన మందుపాతరలను తొలగించేందుకు జర్మనీ సహాయం చేస్తుందని అయితే అది పోరు ముగిసిన తరువాత మాత్రమే జరుగుతుందని కూడా చెప్పాడు. నిజానికి ఇరాన్ తన సత్తాను చాటుకుంది తప్ప అమెరికాను అవమానించలేదు. ఎదురులేని ప్రపంచ రారాజునని విర్రవీగుతున్న అమెరికా పరిమితులను తాజా పరిణామం స్పష్టం చేసింది. మీ పరువు మీరే తీసుకున్నారు, అనుభవించండి అని చెప్పాలనుకున్న జర్మనీ బయటకు మాట్లాడలేక ఇరాన్ పేరుతో ఆ వ్యాఖ్య చేసిందని చెప్పవచ్చు. ఐరోపా దేశాలను ట్రంప్ ఈ వివాదం సందర్భంగా ఎంతగా అవమానించిదీ తెలిసిందే.
ఆర్థిక నష్టాల గురించి ఐరోపా ఉక్కిరిబిక్కిరి
జరుగుతున్న దాడుల పరిణామాల తీరు,ఆర్థిక నష్టాల గురించి ఐరోపాలో అంతర్గతంగా ఉన్న ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని మెర్జ్ వెల్లడించినట్లు చెప్పవచ్చు, జర్మనీ వినియోగదారుల తీరు తెన్నుల సూచిక మే నెలలో 33.3 పాయింట్ల తిరోగమనంలో ఉండవచ్చని చెబుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన 2022 నుంచి నెలవారీ ఇంథన పరిస్థితి ఇంతగా దిగజారలేదు. వాణిజ్య సూచిక 2020లోని బలహీన స్థాయికి పడిపోయింది. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరు రెండు యూరోలు (రూ.221) దాటింది. దీంతో వాటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ధరలు పెరిగినా సరఫరాలో అనిశ్చితి కూడా ఐరోపాలో ఆందోళనకు దారితీస్తోంది. ఇంథన ధరలు విపరీతంగా పెరిగిపోవంటంతో ఫ్రాన్సులోని ట్రాన్స్వియా కంపెనీ మే, జూన్లో కొన్ని విమానాల ప్రయాణాలను రద్దు చేసింది.
ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి సొమ్ము తిరిగి చెల్లిస్తామని లేదా తరువాత తిరిగి ప్రయాణించటానికి అవకాశం ఇస్తామని చెప్పింది. హార్ముజ్ జలసంధి రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో పెట్రోకెమికల్స్ కొరత ఏర్పడిందని దాంతో కండోమ్ (గర్భనిరోధం లేదా సురక్షిత శృంగారం కోసం) ధరలను 30శాతం పెంచుతున్నట్లు ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న కారెక్స్ కంపెనీ ప్రకటించింది. యేటా 500 కోట్ల కండోమ్లను ఈ కంపెనీ తయారు చేస్తున్నది,ప్రపంచ మార్కెట్లో ఇరవై శాతం వాటా కలిగి ఉంది. ఆర్థిక అనిశ్చితి ఉన్నపుడు కండోమ్లను ఎక్కువగా వాడతారని,ఈ ఏడాది 30శాతం డిమాండ్ అదనంగా ఉంటుందని, ధరలను పెంచకతప్పటం లేదని మలేసియాకు చెందిన ఈ కంపెనీ ప్రకటించింది.
ఇరాన్పై దాడులతో అమెరికా ఆయుధ నిల్వలు ముఖ్యంగా క్షిపణుల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు వచ్చిన వార్తలను తాను నమ్మటం లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అంటున్నట్లు మీడియా పేర్కొన్నది. వాన్స్ ఈ పరిస్థితిని చూసి ఆందోళనపడినట్లు చెబుతుండగా ఆయుధాలకేమీ కొదవ లేదని ట్రంప్ యంత్రాంగం చెబుతున్నది. ఇరాన్పై దాడుల గురించి అమెరికా రక్షణశాఖ పెంటగన్ చెబుతున్న అంశాలను వాన్స్ పదే పదే ప్రశ్నిస్తున్నాడు. చెబుతున్నది నిజమేనా అని పలువురితో మాట్లాడి ఆరా తీస్తున్నాడు. ఇరాన్పై దాడులకు దక్షిణ కొరియా నుంచి క్షిపణులను తరలించినపుడు తమ సంగతేమిటని ఆ దేశ అధ్యక్షుడు బహిరంగంగానే ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో, చైనా మీద ప్రయోగించేందుకు తైవాన్లో, రష్యాను అదుపు చేసేందుకు అంటూ ఐరోపాలో అమెరికా పెద్ద ఎత్తున ఆయుదాలను నిల్వచేసింది. వీటిలో ఏవైనా లోటు ఏర్పడితే పరిస్థితి ఆందోళన కరంగా మారుతుందంటూ వాన్స్ భయాన్ని వ్యక్తపరిచినట్లు అట్లాంటిక్ పత్రిక రాసింది. ఎనిమిది వారాల దాడిలో ఇరాన్కు భారీగా నష్టం కలిగించామని ఆయుధాలకు ఎలాంటి లోటు లేదని రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ సైనిక ఉన్నతాధికారుల సమావేశంలో బహిరంగంగా చెప్పాడు.
పాకిస్తాన్పై అమెరికా ఆగ్రహం
మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ అమెరికాకు ఆగ్రహం తెప్పించే నిర్ణయం తీసుకుంది. మూడవ దేశం నుంచి ఇరాన్ వెళ్లాల్సిన వస్తువులను తమ భూభాగం ద్వారా చేరవేసేందుకు ఆరు మార్గాలను ప్రకటించింది. బలూచిస్తాన్లో సరిహద్దుల్లో వస్తుమార్పిడి కోసం కరాచీ, ఖాసిం, గద్వార్ రేవుల నుంచి ఏర్పాటు చేసింది. అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది.ఇరాన్ తన ఆహార అవసరాలకోసం దిగుమతుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నది. హార్ముజ్ జలసంధిలో అమెరికా అడ్డుకోవటంతో అది తన అవసరాలను కాస్పియన్ సముద్రం ద్వారా తెచ్చుకొనేందుకు పూనుకుంది. అందువలన ఇరాన్ చమురు రవాణాను అమెరికా అడ్డుకోగలదు తప్ప ఇతర ఇరాన్ దిగుమతులను నిరోధించలేదని చెప్పవచ్చు.వాటిని కూడా అడ్డుకొనేందుకు తెగబడితే సంక్షోభ స్వరూపమే మారిపోతుంది. చమురు ధరలు పెరగటంతో ప్రత్యామ్నాయ ఇంథనం గురించి వెతుకులాట ఎక్కువైంది. ఇది చైనాకు వరంగా మారినట్లు కనిపిస్తోంది.హరిత ఇంథన ఉత్పత్తులైన సోలార్ పలకలు, విద్యుత్ వాహనాలు, బ్యాటరీల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
ఫిబ్రవరితో పోలిస్తే 30శాతం విలువ పెరిగి మార్చినెలలో 25.77 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది మార్చినెలతో పోలిస్తే విదేశాల్లో వాటి అమ్మకాలు 50శాతం పెరిగాయి. సోలార్ పలకల ఎగుమతి ఫిబ్రవరితో పోల్చితే మార్చినెలలో రికార్డు స్థాయిలో 68గిగావాట్లకు పెరిగాయి. దీనికి ప్రపంచమంతటా పెరిగిన చమురు ధరలతో పాటు చైనా పన్ను రాయితీల్లో చేసిన మార్పులు కూడా కారణమయ్యాయి.
కొసమెరుపు: స్వతంత్ర దేశాల విధానాలు ఎలా ఉండాలో అమెరికా ఇంకేమాత్రం నిర్దేశించలేదని ఇరాన్ వ్యాఖ్యానిం చింది. తన చట్టవిరుద్దమైన, గొంతెమ్మ కోరికలను వదులు కోవాలని ఇరాన్ రక్షణశాఖ ఉపమంత్రిó రజా తలాయి నిక్ షాంఘై సహకార దేశాల ప్రతినిధులతో చెప్పాడు. ఇరాన్ చేసిన మూడు ప్రతిపాదనల గురించి అమెరికా సమీక్ష చేస్తున్నదని వార్తలు రాగా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, అణుకార్య క్రమం మీద రాజీపడకూడదని సలహాదారులతో అన్నట్లు రాయిటర్స్ పేర్కొన్నది. తాజా ప్రతిపాదనల తరువాత మంగళ వారం నాడు లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు చేసింది. విశ్వాసం సన్నగిల్లుతున్నదని, జలసంధిపై చర్చలతో పరిష్కా రానికి రావాలని ఐరాస కోరింది, అందరి మాటలను పెడచెవిన పెడుతున్న ట్రంప్కు ఈ మాటలు రుచిస్తాయా!
ఎం కోటేశ్వరరావు
8331013288



