8 జట్లతో టీ20 లీగ్కు రంగం సిద్ధం
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ క్రికెటర్లు పొట్టి ఫార్మాట్లో నైపుణ్యాలు చాటేందుకు టీజీ20 (తెలంగాణ20) లీగ్ను తీసుకురానుంది. ఈ ఏడాది జూన్/జులైలో ఆరంభం కానున్న టీ20 లీగ్ లోగోను బుధవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో అట్టహాసంగా ఆవిష్కరించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరినాథ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, రాష్ట్ర నూతన డీజీపీ సీవీ ఆనంద్, హెచ్సీఏ ఏకసభ్య కమిటీ చైర్మెన్ జస్టిస్ నవీన్ రావు సహా సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, శ్రీకాంత్ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘తెలంగాణ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు టీజీ20 లీగ్ను తీసుకొస్తున్నాం. ఈ లీగ్తో తెలంగాణ క్రికెటర్లు దేశవాళీ సర్క్యూట్తో పాటు జాతీయ జట్టులోనూ అవకాశాలు దక్కించుకునేలా సత్తా చాటుతారని బలంగా నమ్ముతున్నాను. టీజీ20 ప్రాంఛైజీల కోసం విశేష స్పందన వచ్చింది. ఈ లీగ్తో క్రికెట్ అభివృద్దిలో హెచ్సీఏ మరో అడుగు ముందుకేయనుందని’ హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్రెడ్డి అన్నారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘మరో ఎనిమిదేండ్లలో హెచ్సీఏ వందేండ్లు పూర్తి చేసుకోనుంది. వచ్చే వందేండ్లలో గత వందేండ్లలో తయారు చేసిన క్రికెటర్ల కంటే ఎక్కువ మందిని జాతీయ జట్టుకు అందించాలి. జాతీయ జట్టుకు చాంపియన్ క్రికెటర్లను అందించిన ఘనత హైదరాబాద్ సొంతం. ఆ వారసత్వం కొనసాగాలని’ అన్నాడు. హెచ్సీఏ ఆఫీస్బేరర్లు, క్లబ్ సెక్రటరీలు, ప్రాంఛైజీల వేలంపై ఆసక్తి వ్యక్తపరిచిన కంపెనీల ప్రతినిధులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
హెచ్సీఏ టీజీ20 లోగో ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -



