మరింత దిగజారిన భారత్ 157కు పడిపోయిన ర్యాంకు
పొరుగుదేశాల ప్రదర్శన బెటర్
మెరుగైన స్థితిలో నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లా, పాక్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2026 ర్యాంకింగ్స్
మోడీ పాలనలో మీడియాపై అణచివేత ధోరణి
న్యూఢిల్లీ : భారత్లో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పబడే మీడియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మోడీ పాలనలో పత్రికా స్వేచ్ఛ మరింతగా దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ ర్యాంకు ఏటికేడూ పడిపోతోంది. ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026’ ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంకు 157కు పడిపోయింది. మనకం టే…పొరుగుదేశాలైన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఈ ర్యాంకింగ్లో ముందువరుసలో ఉండటం గమనార్హం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో పత్రికా స్వేచ్ఛ ఎంత ప్రమాదంలో ఉన్నదో ఈ పరిణామం తెలియజేస్తున్నదని మేధావులు అంటున్నారు. ఈ పరిస్థితికి మోడీ సర్కారు అనుసరిస్తున్న అణచివేత ధోరణి, కఠిన విధానాలే కారణమని చెప్తున్నారు. ప్రపంచ మీడియా స్వేచ్ఛను అంచనా వేసే సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) 2026 ఏడాదికి సంబంధించి ఈ తాజా సూచికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు ర్యాంకులను కేటాయించింది. ముఖ్యంగా ఐదు ప్రమాణాల ఆధారంగా తీసుకున్నారు. ఇందులో ఆర్థిక, చట్టపరమైన, భద్రతా పరిస్థితులు, రాజకీయ, సామాజిక వాతావరణం వంటివి ఉన్నాయి.
ఆరు స్థానాలు దిగజారిన భారత్
ఇందులో భారత్ ర్యాంకు 157గా ఉంది. గతేడాది భారత్ ర్యాంకు 151గా ఉండగా.. అది ఇప్పుడు ఆరు స్థానాలు దిగజారడం ఆందోళనకరం. భారత్ తన పొరుగు దేశాలతో పోలిస్తే కూడా వెనుకబడింది. నేపాల్ (87వ ర్యాంకు), మాల్దీవులు (108), శ్రీలంక (134), భూటాన్ (150), బంగ్లాదేశ్ (152), పాకిస్తాన్ (153)లు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. ఇక ప్రపంచంలో అత్యుత్తమ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాలుగా నార్వే, నెదర్లాండ్స్, ఎస్టోనియాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
ట్రంప్ పాలనలో..పడిపోయిన అమెరికా స్థానం
ఇక ఈ సూచికలో అమెరికా ర్యాంకు కూడా దిగజారింది. ఈ సారి ఏడు స్థానాలు పడిపోయి 64వ స్థానానికి చేరింది. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి పదవిలోకి వచ్చిన తర్వాత అమెరికాలోనూ ప్రెస్ ఫ్రీడమ్ తగ్గిందనే విరమ్శలు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛకు స్థానం ఇవ్వకుండా.. వాటిని నియంత్రించే ధోరణిని ట్రంప్ అనుసరి స్తున్నారనీ, అందుకే ఇక్కడ కఠిన పరిస్థితులు ఉన్నాయని మేధావులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్లోని ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.
జర్నలిస్టులపై కేసులు, చట్టపరమైన చర్యలు
పత్రికా స్వేచ్ఛను అంచనా వేసిన ఐదు ప్రమాణాల్లో చట్టపరమైన అంశం (లీగల్ ఇండికే టర్) అత్యంత క్షీణతను నమోదు చేసిందని నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జర్నలి జంపై క్రిమినల్ కేసులు, చట్టపరమైన చర్యలు పెరుగుతు న్నాయనడానికి సంకేతమని వివరించిం ది. భారత్ తో పాటు ఈజిప్ట్, ఇజ్రాయిల్, జార్జియా వంటి దేశాల్లో ఈ పరిస్థితి కనిపించిందని పేర్కొంది.
ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఆందోళనకరం
ప్రపంచవ్యాప్తంగానూ ప్రెస్ ఫ్రీడమ్ దిగజారుతోంది. ప్రజాస్వామ్య దేశాల్లో కూడా చట్ట వ్యవస్థలను మీడియాను అణగదొక్కే ఆయుధా లుగా వాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక భారత్లో స్వతంత్ర మీడియాపై న్యాయపరమైన వేధింపులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, పరువునష్టం, జాతీయ భద్రతా చట్టాలు వంటి క్రిమినల్ చట్టాలను జర్నలిస్టులపై వినియోగిస్తున్నారని ఆర్ఎస్ఎఫ్ వివరించింది.
అత్యంత తీవ్రమైన క్యాటగిరీలో భారత్
ఈ సూచిక 2002 నుంచి వెలువడుతోంది. ఇప్పుడు మొదటిసారిగా ప్రపంచ దేశాల్లో సగానికి పైగా దేశాలు ‘కష్టతరమైన’, ‘అత్యంత తీవ్రమైన’ ప్రెస్ ఫ్రీడమ్ క్యాటగిరీలో చేరాయి. ప్రారంభంలో ఈ సంఖ్య 13.7 శాతంగానే ఉండేది. కాగా ప్రస్తుతం భారత్ ‘అత్యంత తీవ్రమైన’ క్యాటగిరీలో ఉండటం గమనార్హం.



