రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైబిజ్ టీవీ మీడియా ఆధ్వర్యంలో అవార్డ్స్ అందజేత
ఐదుగురికి లెజెండరీ పురస్కారాలు
మరో 60 మంది మీడియా ప్రతినిధులకు అవార్డుల ప్రదానం
జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రభుత్వం మీడియాకు అనుకూలమనీ, నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త టెక్నాలజీల ప్రభావంపై సీనియర్ జర్నలిస్టులు ఆలోచించి మీడియా అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. అందుకు ప్రభుత్వం వేదిక కల్పించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో హైబిజ్ టీవీ మీడియా అవార్డుల కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి డి శ్రీధర్బాబు, ఎంపీ అనిల్కుమార్యాదవ్, ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ ప్రెసిడెంట్ వివేక్ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐదుగురికి లెజెండరీ పురస్కారాలను మంత్రి అందజేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు చెందిన 60మంది జర్నలిస్టులకు అవార్డులను ప్రదానం చేశారు. జర్నలిస్టుల పిల్లల చదువులకు ఒక్కోక్కరికీ రూ.25 వేల ఆర్థియ చేయూతకు సంబంధించిన స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో మీడియా పాత్ర గొప్పదన్నారు. నిర్వహకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం రవీందర్రెడ్డి, లైఫ్ స్పాన్ అధినేత నరేంద్ర రామ్ నంబుల, క్రెడారు హైదరాబాద్ ప్రెసిడెంట్ జయదీప్రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజ్గోపాల్, హైబిజ్ టీవీ ఎల్ఎల్పి ఎండి డాక్టర్ జె సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.



