నవతెలంగాణ-మిడ్జిల్
ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్యను పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి విద్యార్థి కూడా డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్ చెప్పారు. ప్రజా పాలనల ప్రగతి ప్రణాళికల లో భాగంగా మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల డిజిటల్ క్లాసెస్ కోసం ఎల్ఇడి స్క్రీన్ ప్రిన్సిపాల్ తిరుపతయ్యతో కలిసి బుధవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో సర్పంచ్ శంకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో, విద్యారంగం చాలా వేగంగా మారుతోంది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, సాంకేతికతను ఉపయోగించి విద్యార్థులు చదువుకోవాలని సూచించారు. సులభంగా అర్థం చేసుకోవడం బోర్డు మీద రాసే పాత పద్ధతి కంటే, డిజిటల్ తరగతుల ద్వారా వీడియోలు, చిత్రాల రూపంలో పాఠాలు చూడటం వల్ల విషయాలు సులభంగా అర్థమవుతాయి అని పేర్కొన్నారు.
ఇందులో క్లిష్టమైన సైన్స్ ప్రయోగాలు లేదా చరిత్ర అంశాలను కార్టూన్లు, యానిమేషన్ల ద్వారా చూడటం వల్ల ఉపాధ్యాయులు నేరుగా తెరపై చూపిస్తూ బోధించడం వల్ల విద్యార్థులకు సందేహాలు తీరుతాయి అని తెలిపారు. డిజిటల్ క్లాస్రూమ్ల ద్వారా ప్రపంచంలోని ఏ అంశాన్నైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు అన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అస్రబ్ ఒనిసా, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నరేందర్ రెడ్డి, అధ్యాపక బృందం,వార్డు సభ్యులు పర్వతాలు, ఎండి జహీర్, కాంగ్రెస్ యువ నాయకులు, పసుల శివ, గోదా కృష్ణ, బండి నరసింహ తదితరులు పాల్గొన్నారు.



