నవతెలంగాణ-అశ్వారావుపేట: విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని అందించేది పుస్తకమేనని,పుస్తకాలతో మమేకమైతే మానసిక వత్తిడులు దూరమవుతాయని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు.విద్యావారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా “డిజిటల్ యుగంలో పుస్తకాల ఆవశ్యకత” అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ క్రమంలో హరిత మాట్లాడుతూ.. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ గ్రంథాలయ పుస్తకాలు చదవాలని విద్యార్థులకు సూచించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటు సంస్కర్తలు,మహనీయుల జీవిత చరిత్రలు, కథల పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని కోరారు.
అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్చార్జి పి.పుల్లయ్య, ఉపాధ్యాయులు ఊడల కిషోర్ బాబు, కె.ఆర్.సి ప్రసాద్, సువార్తమ్మ, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.



