నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్, వెనిజూలా మాదిరిగానే క్యూబాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పావులుకదుపుతున్నారు. ఇరాన్పై ఎటాక్ చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను యూఎస్ సైన్యం అకారణంగా కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా క్యూబాలో కూడా ఇరాన్ తరహాలోనే దాడి చేయాలని ట్రంప్ కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఆంక్షలు పెట్టి ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ట్రంప్ చర్యలకు క్యూబా మాస్ వార్నింగ్ ఇచ్చింది.
అమెరికా తమ దేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే రక్తపాతం సృష్టిస్తామని క్యూబా హెచ్చరించింది. అమెరికాకు గానీ మరే ఇతర దేశానికి గానీ ముప్పు కలిగించే విధంగా క్యూబా ప్రవర్తించడం లేదని వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఇతరుల సైనిక దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి క్యూబాకు సంపూర్ణమైన చట్టబద్ధమైన హక్కు ఉందని అన్నారు.
ఒకవేళ అమెరికా క్యూబాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే వియత్నాం యుద్ధ శైలిలో క్యూబా ప్రజలు ఆయుధాలు చేతబట్టి చివరి వరకు గెరిల్లా పద్ధతిలో పోరాడతారని.. అది ఒక మహా రక్తపాతంగా మారుతుందని హెచ్చరించారు. అదేవిధంగా, తమపై సైనిక దాడికి అమెరికా ఒక తప్పుడు, ప్రణాళికాబద్ధమైన సాకును సృష్టిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



