నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ వ్యవహరంపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని వామపక్ష విద్యార్ధి సంఘాలు SFI, AISF, PDSU డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యను కార్పొరేటికరణ దిశగా నెట్టివేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రవేశ పరీక్షలను కేంద్రీకరించడం ద్వారా రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విమర్శించారు. విద్యార్థుల ప్రతిభను కాకుండా కోచింగ్ కేంద్రాలకు వెళ్లే ఆర్థిక స్థోమతను మాత్రమే కొలిచే విధంగా నీట్ వ్యవస్థ మారిపోయిందన్నారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, అవినీతి ఘటనలు ఎన్టీఏ వైఫల్యాన్ని పూర్తిగా బయటపెట్టాయని తెలియజేశారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించందని,పరీక్ష రాసిన విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి,ఆందోళనకు గురయ్యారని, కానీ కేంద్రం కనీస బాద్యత వహించడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేటి సాంబశివరావు విమర్శించారు. నీట్ రీ ఎగ్జామ్ను స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
భారత్ రాజ్యాంగం కల్పించిన విద్య హక్కును కేంద్రం క్రమంగా హరిస్తోందని, రాష్ట్రాల సామాజిక, భాషా పరిస్థితులను అంచనా వేయకుండా ఒకే దేశం-ఒకే పరీక్ష అంటూ కేంద్రం గుడ్డిగా ముందుకు పోతుందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.
గ్రామీణ విద్యార్థులకు సమాన అకాశాలు లేని విద్యా వ్యవస్థను వ్యతిరేకించాలని అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. పేద విద్యార్థలు వైద్య విద్య అందకుండా నీట్ వ్యవస్థ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.



