ఆ మేరకు రాష్ట్రంలోని యువతను సిద్ధం చేస్తున్నాం : మంత్రి వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్కామ్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం బడ్జెట్లో రూ.90 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో భారత్–యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, యూరోపియన్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా–ఈయూ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్–2లో భాగంగా టామ్కామ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం యూరప్లో విస్తృతస్థాయిలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత్లో నైపుణ్యాలు నేర్చుకునేందుకు పెద్ద ఎత్తున యువత సిద్ధంగా ఉందన్నారు. భారతదేశంలో నైపుణ్యవంతులైన మానవ వనరులను తయారు చేసే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి వారిని యూరోపియన్ దేశాలు ఆహ్వానిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ముందుగానే గుర్తించిన తమ ప్రభుత్వం యువతను గ్లోబల్ కెరీర్ ల వైపు సిద్ధం చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. టామ్కామ్ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలపై మార్గనిర్దేశం చేయడంలో, శిక్షణ అందించడంలో కీలక సంస్థగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన పలువురు యువతీ, యువకులు ఇప్పటికే విదేశాల్లో విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా జర్మన్ భాష సహా విదేశీ భాషల్లో శిక్షణ పొందిన వారికి యూరప్ దేశాల్లో భారీ డిమాండ్ ఉందన్నారు. అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాలపై కూడా ప్రభుత్వం యువతలో అవగాహన కల్పిస్తోందని వివరించారు. సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాల ద్వారా మాత్రమే విదేశీ ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ATCs)ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఈ కేంద్రాల ద్వారా పరిశ్రమ లకు అనుగుణమైన, అంతర్జాతీయ ప్రమాణా లకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ ఉద్యోగ విధానాలు మారుతు న్నాయని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకున్న యువతకు అంతర్జాతీయ అవకాశాలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు. ఈ వర్క్షాప్ ద్వారా తెలంగాణ యువతకు యూరప్ దేశాల్లో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై అవగాహన పెరుగుతోందని చెప్పారు. గ్లోబల్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కిల్ మొబిలిటీకి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వివరించారు. ఇటీవల జర్మనీ పర్యటన సందర్భంగా ఆరోగ్య, తయారీ, సాంకేతిక, సేవా రంగాల్లో నైపుణ్యవంతులైన మానవ వనరులకు భారీ డిమాండ్ ఉందనే విషయాన్ని తాను ప్రత్యక్షంగా గమనించానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భాషా శిక్షణపై పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తూ యువతకు సురక్షితమైన, వృత్తిపరంగా మార్గనిర్దేశం చేసిన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఆదర్శ్ కుమార్ మెహ్రా , ఎల్ఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి మరియు శిక్షణ విభాగం డైరెక్టర్ కాంతి వెస్లీ , రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే. స్నేహాజ, ఐసీడబ్ల్యూఏ జాయింట్ సెక్రటరీ అభిజిత్ చక్రబోర్తి తదితరులు హాజరయ్యారు.
టామ్కామ్ ద్వారాభారత్–యూరప్ నైపుణ్య భాగస్వామ్యం బలోపేతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



