Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ

సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ

- Advertisement -

బాధిత కుటుంబాలకిచ్చే పరిహారం, తేడాలు ఉంటే వాటి వివరాలివ్వాలని ఆదేశం

హైదరాబాద్‌ : సిగాచీ కంపెనీలో జరిగిన దారుణ పేలుడు ఘటనలో మరణించిన వాళ్ల కుటుంబాలకు ఇచ్చిన పరిహార చెల్లింపులు, వాటిలో తేడాలు ఉంటే వాటి వివరాలు, అందుకు కారణాలు తెలియజేయాలని రాష్ట్రానికి, ఆ కంపెనీకి హైకోర్టు ఆదేశించింది. బాధితులకు న్యాయ సహాయం అందజేయాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రెటరీ, సంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని ఆదేశించింది. విచారణ మార్చి 12కు వాయిదా వేసింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ లో జూన్‌ 30న జరిగిన పేలుడు ఘటనలో 46 మంది మరణించారు, 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ తెలియలేదు. దీనిపై హైదరాబాద్‌ స్నేహపురి కాలనీకి చెందిన రిటైర్డ్‌ సైంటిస్ట్‌ కలపాల బాబురావు వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది.

అమికస్‌ క్యూరీ డొమినిక్‌ ఫెర్నాండేజ్‌ వాదిస్తూ,మతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కంపెనీ, ప్రభుత్వం ఇప్పుడు ఆ బాధ్యత తమది కాదంటే తమది కాదని అంటున్నాయని చెప్పారు. ఇప్పుడు రూ.25 లక్షలే చెల్లిస్తామని కంపెనీ చెబుతోందన్నారు. మిగతా పరిహారం కంపెనీ చెల్లించాలని ప్రభుత్వం.. ప్రభుత్వం చెల్లించాలని కంపెనీ చెబుతోందన్నారు. పరిహారం ప్రకటన, చెల్లింపులో వ్యత్యాసంపై నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్‌లోని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కమిషనర్‌, ప్రాంతీయ డైరెక్టర్‌, ఉద్యోగుల రాష్ట్ర బీమా అధికారులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు నిర్ణయించి నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.

బీసీ రిజర్వేషన్లపై పెంపు పిటిషన్‌ విచారణ వాయిదా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంపును సవాలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ పది వారాలకు వాయిదా పడింది. 8 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల జీవో అమలును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయంది. జీవోలను సవాలు చేస్తూ మేడ్చల్‌? మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితోపాటు మరికొందరు వేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని బెంచ్‌ గురువారం మరోసారి విచారించింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినందున పిటిషన్లపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం చెప్పగా, పిటిషన్ల లాయర్లు వ్యతిరేకించారు.

నేడు బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు శుక్రవారం ఎన్నికలు జరుగుతాయి. 23 సభ్యుల పదవుల కోసం 206 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు జరిగాయి. 35 వేలకుపైగా న్యాయవాదులు ఓటర్లుగా ఉండగా వారిలో ఏడున్నర వేల మంది మహిళలున్నారు. వీరంతా శుక్రవారం తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఈసారి ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్భాట ప్రచారం జరిగింది. ప్లెక్సీలతో హైకోర్టు బయట ఎన్నికల ప్రచారం సాగింది. ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఫీజు బకాయిలపై పిటిషన్‌
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించలేదని చెప్పి కాలేజీలు స్టూటెంట్స్‌కు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై దాఖలైన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది. విద్యార్థుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, విచారణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. విచారణ మార్చి 3కు వాయిదా వేసింది. ప్రతివాదులైన ఆర్థిక శాఖకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -