నవతెలంగాణ – జుక్కల్
ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారము కామారెడ్డిలోని సత్య కన్వెన్షన్ హాలులో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, రేషన్ & ఆహార భద్రత, విద్యుత్ సబ్సిడీలు వంటి అనేక పథకాలను ప్రజలకు చేరువ చేసిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించి, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే అధికారులు పేద ప్రజలకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. పంచాయతీ సెక్రటరీల మొబైల్ ఫోన్లలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తో పాటు జుక్కల్ మండల ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



