Sunday, May 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగుట్టలో రూ.99.55 కోట్లతో అభివృద్ధి పనులు

గుట్టలో రూ.99.55 కోట్లతో అభివృద్ధి పనులు

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
టెంపుల్‌ సిటీలో రూ. 43.80 కోట్లతో 
వేద పాఠశాల పనులకు భూమిపూజ
నరసింహున్ని దర్శించుకున్న 
ముఖ్యమంత్రి, మంత్రులు


నవతెలంగాణ-యాదగిరిగుట్ట/భువనగిరి
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్టలో రూ.99.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శనివారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 8:50 నిమిషాలకు హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కు ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఘనంగా స్వాగతం పలికారు. టెంపుల్‌ సిటీలో రూ.43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాల పనులకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్యకల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో పైకప్పు నిర్మాణానికి, రూ.1.35 కోట్లతో రథశాల వైపు మాడవీధుల మెట్ల నిర్మాణానికి, రూ.43.12 కోట్లతో డార్మెంటరీ హాల్‌, దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి యాదగిరి కొండపైకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభులను దర్శనం చేసుకున్నారు. దేవస్థానం ఈవో భవాని ప్రసాద్‌, ధర్మకర్త నర్సింహమూర్తి సీఎంకు, మంత్రులకు స్వామి వారి జ్ఞాపికలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం 10.55 నిమిషాలకు హెలికాప్టర్‌‌లో సీఎం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, సీఎంఓ కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -