కౌన్సిల్ సమీక్షలో మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో నర్సింగ్ విద్య బలోపేతానికి కృషి చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నర్సింగ్ కౌన్సిల్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్షను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీఎన్ఎమ్ విద్యార్థులకు తమ కెరీర్ డెవలప్మెంట్ కోసం పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని అధికారులను సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పది బీఎస్సీ నర్సింగ్ కాలేజీలను, ఒక నర్సింగ్ పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నర్సింగ్ కాలేజీలలో మిడ్ వైఫరీ కోర్సులను బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ పోస్టును క్రియేట్ చేయాలని ఆదేశించారు. నర్సింగ్ కౌన్సిల్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే విద్యార్థులకు, నర్సులకు కార్యాలయ ప్రాంగణంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ డాక్టర్ విద్యుల్లత, తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ సీఈ శశిధర్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నర్సింగ్ విద్య బలోపేతానికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



