జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు
సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలపై గురువారం హైదరాబాద్లోని బీఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి డీజీపీ సీవీ. ఆనంద్తో కలిసి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ గురువారం రాత్రి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. వాటర్ ఫాల్స్, ప్రమాదకర ప్రదేశాలు ఉన్న టూరిస్టు ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎడీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎల్నినో ప్రభావం వల్ల సెప్టెంబర్ లోనూ వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నందున వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. కూరగాయలు పండిస్తే మార్కెట్ లో మంచి ధర ఉండడమే కాకుండా హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా కొనుగోలు చేయించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 249 ప్రమాదకర జలాశయాలున్న పిక్నిక్ స్పాట్స్ లను గుర్తించామనీ, మరో 167 పర్యాటక ప్రాంతాలను గుర్తించి భారీ వర్షాలు, వరదలున్న సమయంలో ఆ ప్రాంతాలకు వెళ్లకుండా పోలీస్ శాఖ తగు చర్యలను చేపట్టిందని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయమందించేందుకు12 కంపెనీల ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి హరిచందన, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



