నవతెలంగాణ-హైదరాబాద్ : భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో కీలక విజయాన్ని అందుకుంది. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (ఎస్ఎఫ్డీఆర్) టెక్నాలజీని ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి విజయవంతంగా ప్రదర్శించింది. ఈ పరీక్షతో సుదూర గగనతల క్షిపణుల (ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్) తయారీలో భారత్ స్వయంసమృద్ధి దిశగా మరో ముందడుగు వేసినట్లయింది.
మంగళవారం ఉదయం 10:45 గంటల సమయంలో ఈ పరీక్షను నిర్వహించారు. ముందుగా గ్రౌండ్ బూస్టర్ సాయంతో క్షిపణి వ్యవస్థను నిర్దేశిత వేగానికి చేర్చారు. ఆ తర్వాత, నాజిల్-లెస్ బూస్టర్, రామ్జెట్ మోటార్ వంటి అన్ని ఉప వ్యవస్థలు ప్రణాళిక ప్రకారం అత్యంత కచ్చితత్వంతో పనిచేశాయి. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐటీఆర్లో ఏర్పాటు చేసిన ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా నమోదు చేసి, ధృవీకరించారు.
ఈ అత్యాధునిక టెక్నాలజీ విజయవంతం కావడంతో భారత్కు గగనతలంలో గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనం లభించనుంది. శత్రు విమానాలను చాలా దూరం నుంచే ఛేదించే సామర్థ్యం భారత వాయుసేనకు అందుబాటులోకి వస్తుంది. దీంతో ఈ పరిజ్ఞానం కలిగిన కొద్ది దేశాల సరసన భారత్ చేరింది.
డీఆర్డీవోకు చెందిన డీఆర్డీఎల్, హెచ్ఈఎంఆర్ఎల్, ఆర్సీఐ వంటి ప్రయోగశాలలు సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీవో శాస్త్రవేత్తలను, సంబంధిత పరిశ్రమలను అభినందించారు. ఇది భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.



