తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్
చెన్నైలో కార్ల్ మార్క్స్ విగ్రహం ఆవిష్కరణ
చెన్నై : ప్రగతిశీల భావజాలమే తమకు బలాన్నిస్తున్నాయని, ఆధిపత్య శక్తులు పెత్తనం చెలాయించాలని చూసినప్పుడు ఈ శక్తితోనే ప్రతిఘటిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పేర్కొన్నారు. సమ సమాజ నిర్మాణ ఆకాంక్షతో నవదోయం లాంటి భావజాలాన్ని అక్షరీకరించి ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత సైద్ధాంతికవేత్త కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని చెన్నయ్ లోని కన్నెమర గ్రంథాలయ ఆవరణలో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం మార్క్స్కు ఘన నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో స్టాలిన్తో పాటు ప్రముఖ పాత్రికేయులు ఎన్ రామ్, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు కె బాలకృష్ణన్, యు వాసుకి, రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముగం, కంట్రోల్ కమిషన్ చైర్మెన్ జి రామకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం వీరపాండ్యన్, వీసీకే చీఫ్ తొల్ తిరుమవలవన్, ఎండీఎంకే చీఫ్ వైకో, పీసీసీ అధ్యక్షులు కె సెల్వ పెరుతంగై తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ విప్లవ నేత అయిన కార్ల్ మార్క్స్ను నిత్యం స్మరించుకునేలా గౌరవించే ఉద్దేశంతో చెన్నైలో సముచిత స్థానంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతేగాది ఏప్రిల్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని రూ.85.8 లక్షల వ్యయంతో నెలకొల్పారు. విగ్రహావిష్కరణ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో స్టాలిన్ ఒక సందేశం పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిశీల ఆలోచనలు, ఆదర్శాలకు కట్టుబడి వుందనడానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు స్టాలిన్ తెలిపారు. ‘మార్క్స్ విగ్రహం స్థాపన, అసమానతల నిర్మూలన. అరుణ వర్ణాన్ని పునరుద్ఘాటించిన చెన్నై. కాన్నెమారా పబ్లిక్ లైబ్రరీ వద్ద కార్ల్ మార్క్స్ విగ్రహ స్థాపన’ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రగతిశీల ఆలోచనలు, భావజాలం ఎక్కడినుంచి వచ్చిందో అనవసరం, వాటి నుంచి మేం బలాన్ని పొందుతున్నాం. ఆధిపత్య శక్తులు మాపై పెత్తనం చెలాయించాలనుకున్నపుడు వాటిని మేం ప్రతిఘటిస్తాం. ఇది మన ద్రవిడ నమూనా సారాంశం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.



