ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైల్వే ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రైల్వే రంగాన్ని రక్షించుకునేందుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. రైల్వే ప్రయివేటీకణను ఆపాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ‘మానిటైజేషన్ పైప్లైన్’ పేరుతో దేశ ప్రజల ఆస్తి అయిన రైల్వేను ప్రయివేటీకరణ చేస్తోందని తెలిపారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల లాభాల కోసమే కేంద్రం ప్రయివేట్ రైళ్లను ప్రవేశపెడుతోందని విమర్శించారు. ఇప్పటికే అనేక రైల్వే స్టేషన్లను ప్రయివేట్ పెట్టుబడిదారులకు అప్పగించడం వల్ల ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రైల్వేస్టేషన్లలో పార్కింగ్ ఫీజులను విపరీతంగా పెంచేశారని అన్నారు.
నాసీరకపు క్యాంటీన్ల ద్వారా అధిక ధరలకు ఆహార పదార్థాలను అమ్ముతూ ప్రయాణికులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస భద్రత లేదని, వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యుల సౌకర్యార్థం జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని కోరారు. రైల్వే రక్షణ కోసం, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో రైల్వే కార్మికులు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి జె.కుమారస్వామి, అధ్యక్షులు ఎం.దశరథ్, నగర ఉపాధ్యక్షులు జి.రాములు, నగర సహాయ కార్యదర్శి కె.నరేష్, ఎం.సత్యనారాయణ, నాయకులు ఎం.అజయ్ బాబు, పి.మల్లేష్, డీఎల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.



